Kerala Twin Tunnel Disaste: కేరళలోని కొండల జిల్లా వయనాడ్ ను భారీ వర్షాలు, కొండచరియలు మళ్లీ ముంచెత్తాయి. రెండేళ్ల క్రితం 2024 లో ముండక్కై, చూరల్మల గ్రామాలను తుడిచిపెట్టేసిన జలప్రళయం సృష్టించిన గాయాలు మానకముందే.. మంగళవారం ఉదయం వయనాడ్లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జిల్లాలోని మేప్పాడి సమీపంలో గల కల్లాడి వద్ద, మీనాక్షి బ్రిడ్జ్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక అనాక్కంపోయిల్ - కల్లాడి - మేప్పాడి ట్విన్ టన్నెల్ భూగర్భ సొరంగ మార్గం ప్రాజెక్ట్ సైట్పై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి . ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, కనీసం ఏడుగురు కార్మికులు బురద మట్టి కింద చిక్కుకుని గల్లంతయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం.. వయనాడ్ జిల్లాలో గత 24 గంటల్లో ఏకంగా 265 మిమీ అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లోనే ఇది అత్యధిక వర్షపాతం . పశ్చిమ కనుమల కొండల్లో కురుస్తున్న ఈ జలప్రళయం కారణంగా.. సోమవారం నుంచే టన్నెల్ లోపల సాగుతున్న తవ్వకం పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో టన్నెల్ ఎంట్రన్స్ వెలుపల, వర్క్సైట్ పరిసరాల్లో ఇంజనీర్లు, సెక్యూరిటీ సిబ్బంది, కొందరు కార్మికులు నడుచుకుంటూ వెళ్తుండగా కొండపై పేరుకుపోయిన భారీ మట్టి, రాళ్లు ఉధృతమైన బురద ప్రవాహంగా మారి వారిపైకి దూసుకొచ్చింది. కార్మికులు ప్రయాణించే పలు వాహనాలు కూడా ఈ మట్టి గుట్టల కింద పూర్తిగా కూరుకుపోయాయి. ఈ ప్రమాదంపై కేరళ వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిఖీ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పూర్తిగా మానవ తప్పిదమే అని ఆయన ఆరోపించారు. టన్నెల్ తవ్వకాల వల్ల వచ్చిన భారీ మట్టిని శాస్త్రీయంగా తొలగించకుండా అక్కడే గుట్టలుగా పోయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై కొంకణ్ రైల్వేస్ కు ముందే కలెక్టర్ నోటీసులు ఇచ్చినా నిర్లక్ష్యం వహించారని మంత్రి మండిపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు అత్యంత సాహసంతో స్పందించి ముగ్గురు కార్మికులను ప్రాణాలతో కాపాడారు. సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిమాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన రెండు బృందాలు , కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, లోకల్ పోలీసులు రంగంలోకి దిగారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే, ఘటనా స్థలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, దట్టమైన బురద ప్రవాహం రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. మట్టిని తొలగించడానికి భారీ హిటాచీ, జేసీబీ వంటి ఎర్త్ మూవింగ్ యంత్రాలను క్షేత్రస్థాయికి తరలించారు.
ఈ ప్రమాదంపై కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తిరువనంతపురంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ మంత్రి ఏ.పి. అనిల్ కుమార్, వ్యవసాయ మంత్రి టి. సిద్ధిఖీలను తక్షణమే వయనాడ్కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సీఎం ఆదేశించారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే వందలాది మందిని బలిగొన్న పాత ముండక్కై ప్రాంతం ఉండటంతో స్థానిక గిరిజన, కొండ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మట్టి కింద ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనేది తెలియాల్సి ఉండటంతో, రెస్క్యూ టీమ్స్ సమయంతో పోటీ పడుతూ శ్రమిస్తున్నాయి.
