Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

ABP Desam Updated at: 07 Oct 2022 07:31 PM (IST)
Edited By: Murali Krishna

Karnataka Ola Uber Auto Ban: 3 రోజుల్లోపు ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు తమ ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

NEXT PREV

Karnataka Ola Uber Auto Ban: కర్ణాటక రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై సర్కార్ బ్యాన్ విధించింది. 3 రోజుల్లోపు తమ ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది.

  


ఓలా, ఉబర్.. 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి కూడా రూ.100 వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు రవాణా శాఖలో ఫిర్యాదులు నమోదు చేశారు. దీంతో రవాణా శాఖ అక్టోబర్ 6న ఈ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం.. మొదటి 2 కి.మీకి కనీస ఆటో ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15 వసూలు చేస్తారు.



ఆయా కంపెనీలు తమ ఆటో సేవలను వీలైనంత త్వరగా నిలిపివేయాలి. టాక్సీలలో ప్రయాణీకుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.               -    కర్ణాటక రవాణా సంస్థ


భారీగా ఛార్జీలు


ఓలా, ఉబర్, ర్యాపిడో.. ఈ మధ్య ఎక్కడికి వెళ్లాలన్నా చాలా మంది ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కంపెనీలు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని, ఛార్జీల బాదుడును భారీగా పెంచేశాయి. దీంతో కర్ణాటక రవాణా శాఖ ఈ మూడు రైడ్ హైరింగ్ సర్వీసు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.


మూడు రోజుల్లోగా ఈ కంపెనీలు తమ ఆటో సర్వీసులను ఆపివేయాలని ఆదేశించింది. ఈ సంస్థల ఆటోలు అక్రమంగా సర్వీసులను అందిస్తున్నాయని తెలిపింది. మూడు రోజుల్లోగా ఈ సంస్థల సర్వీసులను ఆపివేసి, వెంటనే నివేదికను సమర్పించాలని ఈ వెహికిల్ అగ్రిగేటర్లను కర్ణాటక ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ ఆదేశించింది.



ఆటో సర్వీసులను ఈ సంస్థలు మూడు రోజుల్లోగా ఆపివేయాలి. అయితే ట్యాక్సీలను నడుపుకోవచ్చు. కర్ణాటక ఆన్ డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్, 2016 కింద కేవలం ట్యాక్సీలను నడుపుకునేందుకు మాత్రమే లైసెన్సులను మంజూరు చేస్తున్నాం. ఈ రూల్స్ ఆటోలకు అప్లయ్ కావు. ట్యాక్సీలంటే.. డ్రైవర్‌ను మినహాయించి ఆరుగురికి మించి కూర్చునేందుకు వీలు లేని సీటింగ్ సామర్థ్యం ఉన్న మోటార్ క్యాబ్‌. ఈ రెగ్యులేషన్స్‌ను అతిక్రమించి, ఈ వెహికిల్ అగ్రిగేటర్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులను అందజేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే అత్యధికంగా ఈ ఆటో రిక్షాలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. -  టీహెచ్‌ఎం కుమార్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్


కొత్త యాప్


మరోవైపు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్‌(ARDU)తో పాటు నందన్ నిలేకనికి చెందిన బెకన్ ఫౌండేషన్ బెంగళూరులో నమ్మ యాత్రి యాప్‌(Namma Yatri App)ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. నవంబర్ 1న ఈ నమ్మ యాత్రి యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.


Also Read: Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసు అప్‌డేట్- కీలక తీర్పు వాయిదా!


Also Read: Ghaziabad Blast: సినిమా చూస్తుండగా పేలిపోయిన టీవీ- బాలుడు మృతి, మహిళకు గాయాలు!


 

Published at: 07 Oct 2022 05:35 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.