DK Shivakumar:



డీకే శివకుమార్ ప్రచారం..


కర్ణాటకలో ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. కీలక నేతలంతా యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే బీజేపీ ఫుల్ స్వింగ్‌లో ప్రచారం మొదలు పెట్టింది. అటు కాంగ్రెస్‌ నేతలూ క్యాంపెయినింగ్‌కి రెడీ అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శ్రీరంగపట్నలో ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ప్రచార వాహనంలో నుంచి రూ.500 నోట్లు ప్రజలపైకి విసిరారు. ప్రజాధ్వని యాత్ర పేరిట ప్రచారం చేస్తున్న ఆయన...మండ్యా జిల్లాలోని బెవినహళ్లి వద్ద ఇలా నోట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకూ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చిన శివకుమార్...తన కార్‌లోని నోట్‌లు తీసి ఒక్కసారిగా అందరిపై విసిరారుయ కాంగ్రెస్ ఈ సారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని అధిష్ఠానం చాలా బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ గెలిస్తే...ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివకుమార్‌ను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇలా నోట్లు విసిరి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడే కాదు. వొక్కళిగ వర్గానికి చెందిన ఆయనను గతంలోనూ ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. మైసూరులో ఈ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ వర్గం అంతా తప్పకుండా తనవైపే నిలబడుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే శివకుమార్. అయితే..నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కోవటం వల్ల కాస్త ఇబ్బందులు తప్పలేదు. చాన్నాళ్లుగా ఆయన ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లి విచారణకు హాజరై వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు హవాలా లావాదేవీలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది.