Karnataka Election Result 2023:


ఉదయం 8 నుంచి కౌంటింగ్ 


దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election 2023) గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఈ సారి కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రచారం కూడా గతంలో కన్నా వాడివేడిగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పాటు అక్కడే పర్యటించారు. అటు రాహుల్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేశారు. సౌత్‌లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. ఇక్కడ గెలిస్తే....ఇక్కడి నుంచే సౌత్ మిషన్‌ను అమలు చేయాలని చూస్తోంది కాషాయ పార్టీ. కానీ...ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కు మొగ్గు చూపుతున్నాయి. అయినా...బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగానే ఉంది. అందుకే..ఈ సారి ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తం 73.18% మేర పోలింగ్ నమోదైంది. ఈ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నానికే ట్రెండ్‌ తెలిసిపోతుంది. ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయన్నది తేలిపోతుంది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 


ట్రెండ్ మారుతుందా? 


కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు అవసరం. కాంగ్రెస్ తమకు 120కి పైగా సీట్లు వస్తాయని ధీమాగా ఉంది. అటు బీజేపీ కూడా 125 సీట్లు వస్తాయని జోస్యం చెబుతోంది. కర్ణాటకను రాజకీయపరంగా 5 ప్రాంతాలుగా విభజించి చూస్తే...దాదాపు అన్ని చోట్లా కాంగ్రెస్‌కే ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే...అప్పుడు JDS కింగ్ మేకర్ అవుతుంది. ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ ఇస్తే..ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో "హంగ్" వచ్చే అవకాశమూ ఉందని తేలడం వల్ల టెన్షన్ మరింత పెరిగింది. తాము లేనిదే ప్రభుత్వం ఏర్పాటు కాదని గట్టిగానే చెబుతోంది జేడీఎస్. కాంగ్రెస్ మాత్రం అలాంటిదేమీ లేదని, తామే మెజార్టీ సీట్లు సాధిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే..కర్ణాటక ఎన్నికల ట్రెండ్‌ని చూస్తే...కన్నడిగులు ఎప్పుడూ ప్రస్తుత ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చిన దాఖలాల్లేవు. ఇలా చూస్తే...బీజేపీని కాదని కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. 1985 నుంచి రాష్ట్రంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 


బరిలో నిలిచిన కీలక అభ్యర్థులు వీళ్లే..


కర్ణాటక ఎన్నికల బరిలో పలు కీలక అభ్యర్థిలో బరిలోకి దిగారు. వీళ్లు గెలుపోటములపైనా ఉత్కంఠ నెలకొంది. 


బసవరాజు బొమ్మై (బీజేపీ) - షిగ్గావ్ 
సిద్దరామయ్య (కాంగ్రెస్) - వరుణ 
డీకే శివకుమార్ (కాంగ్రెస్) - కనకపుర
హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్) - చెన్నపట్న 
నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) - రామనగర 
జగదీశ్ షెట్టర్ (కాంగ్రెస్) - హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ 


ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్


ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మొగ్గు కనిపించింది. ఆ పార్టీకి 100 నుంచి 112 సీట్లు వరకూ రావొచ్చని ఎగ్దిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే మెజార్టీకి కావాల్సింది 113 స్థానాలు. బీజేపీకి 83-95 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జేడీఎస్‌కు 21-29, ఇతరులకు 2-6 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. 


Also Read: Karnataka Election 2023: సౌతాఫ్రికా EVMలనే కర్ణాటకలో వాడారంటూ కాంగ్రెస్ ఆరోపణలు, కొట్టి పారేసిన ఈసీ