BJP MLA On Azaan:


అజాన్‌పై వ్యాఖ్యలు..


కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ప్రార్థనలు చేసే సమయంలో లౌడ్‌ స్పీకర్‌లు పెట్టడంపై ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. "అల్లా చెవిటి వాడైతే ఆ స్పీకర్‌లు పెట్టి మరీ పిలవాలి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి Azaanపై డిబేట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది కర్ణాటక హైకోర్టులోనూ దీనిపై విచారణ జరిగింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా అదే సమయానికి పక్కనున్న మసీదులో నుంచి అజాన్ వినబడింది. అసహనానికి గురైన ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. 


"నేను ఎక్కడికి వెళ్లినా ఇదో పెద్ద తలనొప్పిలా తయారైంది. సుప్రీంకోర్టులో తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో అప్పుడు దీనికి ముగింపు పలక తప్పదు" 


- కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ ఎమ్మెల్యే










అంతటితో ఆగకుండా అల్లాపై కామెంట్స్ చేశారు ఈశ్వరప్ప. ఆయనేమైనా చెవిటి వాడా అంటూ అపహార్యం చేశారు. 


"ఆలయాల్లో యువతులు, మహిళలు పూజలు, భజనలు చేస్తారు. మాకూ మతంపై నమ్మకముంది. కానీ మేం మీలా లౌడ్‌స్పీకర్‌లు పెట్టం. లౌడ్‌స్పీకర్లు పెట్టి పిలిస్తే తప్ప పలకలేదంటే మీ అల్లా చెవిటి వాడై ఉంటాడు"


- కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ ఎమ్మెల్యే


ఎప్పుడూ వివాదాలే..


కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈశ్వరప్ప ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. టిప్పు సుల్తాన్‌ను ముస్లిం గూండా అంటూ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. తాను చనిపోవడానికి ఈశ్వరప్పే కారణం అంటూ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు కాంట్రాక్టర్. అది కూడా వివాదాస్పదమైంది. 2005 జులైలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లౌడ్‌స్పీకర్‌లు వాడటాన్ని నిషేధించింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపునిచ్చింది. ఆ తరవాత అదే సంవత్సరం అక్టోబర్‌లో పండుగ వేళల్లోనూ వీటిని వినియోగించవచ్చని వెల్లడించింది. అయితే అజాన్‌పై దాఖలైన పిటిషన్‌లను పరిశీలించిన కర్ణాటక హైకోర్టు మసీదులకు ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగబద్ధం కాదని తెలిపింది. అజాన్‌పై ఆంక్షలు విధించడం అంటే ప్రాథమిక హక్కులను అణిచివేయడమేనని వ్యాఖ్యానించింది. 


Also Read: Goa Crime: గోవాలోని రిసార్ట్‌లో దారుణం, కత్తులతో దాడి చేసిన దుండగులు - విచారణకు సీఎం ఆదేశాలు