Jharkhand Trust Vote:


బల నిరూపణ కోసమే..


ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పైనే అవినీతి ఆరోపణలు రావటం  వల్ల ప్రభుత్వం కుప్ప కూలుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే...సీఎం సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ నిర్వహించనున్నారు. ఇదే విషయమై సెక్రటేరియట్ నుంచి అందరి ఎమ్మెల్యేలకు లేఖలు అందాయి. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆ లేఖల్లో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలంటే...ఇదొక్కటే మార్గమని భావిస్తున్నారు సోరెన్. "రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజులుగా కన్‌ఫ్యూజన్‌ నడుస్తోంది. ఇది తొలగిపోయేందుకు గవర్నర్‌ను కలిశాం. రెండు మూడు రోజుల్లో స్పష్టతనిస్తామని
చెప్పారు. కానీ ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదు. అందుకే...అసెంబ్లీ సెషన్‌ నిర్వహించి మా బలం నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాం" అని మంత్రి అలమ్‌గిర్ అలమ్ వెల్లడించారు. ఈలోగా భాజపా కూడా అప్రమత్తమైంది. వెంటనే మీటింగ్ పెట్టుకుంది. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ముందుగానే లెక్కలు వేసుకుంది. అందుకు అనుగుణంగా...సోరెన్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.


ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేశారు గవర్నర్ రమేష్ బెయిస్. అప్పటి నుంచి రాజకీయాలు మలుపు తిరిగాయి. కావాలనే భాజపా టార్గెట్ చేసిందిన, JMM ఆరోపిస్తోంది. ప్రస్తుతానికి ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎమ్‌ఎమ్‌, ఆర్‌జేడీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. అయితే...ఎవరెన్ని కుట్రలు చేసినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, స్పష్టమైన మెజార్టీ ఉందని ధీమాగా చెబుతోంది యూపీఏ. రాష్ట్రంలోని పరిస్థితులపై సెప్టెంబర్ 1 వ తేదీన యూపీఏ ఎమ్మెల్యేలతో గవర్నర్ భేటీ అయ్యారు. ఆ తరవాత గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. అయితే...కేవలం తాను మెడికల్ చెకప్ కోసమే వెళ్లానని ఆయన స్పష్టతనిచ్చారు. అటు యూపీఏ ఎమ్మెల్యేలు మాత్రం..గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


రిసార్ట్ రాజకీయాలు..


అధికార యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ (UPA)కు చెందిన 31 ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. భాజపా ఈ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్న అనుమానంతో ఇలా వారందరినీ వేరే చోటకు తరలించారు. రాయ్‌పూర్‌లోని మే ఫేర్ రిసార్ట్‌లో ఈ ఎమ్మెల్యేలకు నివాసం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు గిరీశ్ దేవాంగన్, సన్నీ అగర్వాల్, రామ్‌ గోపాల్ అగర్వాల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌తో పాటు ఝార్ఖండ్ ముక్తి మోర్ఛ్ (JMM)కి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం 
భూపేష్ బాగేల్ రిసార్ట్‌కు వెళ్లారు. కొందరు JMM ఎమ్మెల్యేలు, మంత్రులు రాంచీలోనే ఉండి ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా అధిగమించాలనే అంశంపై సమాలోచనలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు మంత్రులు కూడా రాయ్‌పూర్‌ బాట పట్టారు. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హతా వేటు వేశారు. "రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర గురించి ఎప్పుడైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం" అని సోరెన్ ఇప్పటికే ప్రకటించారు. ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 


Also Read: Bangladesh PM Sheikh Hasina: రోహింగ్యాలను మేమిక భరించలేం, భారత్ మాత్రమే ఈ సమస్య పరిష్కరించలగదు - బంగ్లాదేశ్ ప్రధాని