Prajwal Revanna Case Updates: అశ్లీల వీడియోలు కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవణ్ణ సిట్‌ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. క్రైమ్‌ జరిగిన ప్లేస్‌లోనే ఆయనను తీసుకెళ్లి విచారించే అవకాశాలున్నాయి. ఎక్కడైతే ఆయన లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వచ్చాయో అదే చోట ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. NDA తరపున కర్ణాటకలోని హసన్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ప్రజ్వల్. అయితే...ఉన్నట్టుండి ఆయన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది కాస్తా రాష్ట్ర రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఆ తరవాత కొంత మంది బాధితులు మహిళా కమిషన్‌ని ఆశ్రయించారు. ప్రజ్వల్ రేవణ్ణ తమను లైంగికంగా వేధించాడని కంప్లెయింట్ ఇచ్చారు. ఈ మేరకు మహిళా కమిషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరవాత ప్రజ్వల్ రేవణ్ణ కనిపించకుండా పోయారు. ఆరోపణలు వచ్చిన వెంటనే జర్మనీకి పారిపోయారు. ఆ తరవాత ఆయనపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ తరవాత హెచ్‌డీ దేవెగౌడ కూడా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.


సమాధానం చెప్పని ప్రజ్వల్..


రెండు రోజులుగా విచారిస్తున్నా ప్రజ్వల్ రేవణ్ణ ఏ ప్రశ్నకీ సమాధానం ఇవ్వడం లేదు. కేవలం తనపై కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారని, ఏ తప్పూ చేయలేదని వాదిస్తున్నారు. ఇప్పటికే ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ అజ్ఞాతంలోకి వెళ్లారు. కొడుకు అరెస్ట్ అయిన వెంటనే ఆమె కనిపించకుండా పోయారు. సిట్‌ విచారణను తప్పించుకునేందుకే ఆమె అలా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న వాదన వినిపిస్తోంది. పని మనిషి కిడ్నాపింగ్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణతో పాటు భవానీ రేవణ్ణ కూడా నిందితురాలిగా ఉన్నారు. అంతకు ముంది సిట్‌కి ఆమె లేఖ రాశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. కానీ ఇంతలోనే మాయమవడం సంచలనమైంది. ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు భవానీ రేవణ్ణ లేరని వెల్లడించారు. సిట్ విచారణకు హాజరు కాకపోతే ఆమెని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఆమె ముందస్తు బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టుని ఆశ్రయిస్తారని సమాచారం. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణకి సమన్లు జారీ చేసింది. కిడ్నాపింగ్ కేసులో ఆయనకు బెయిల్ రావడాన్ని సిట్ సవాల్ చేసింది. ఈ మేరకు సమన్లు ఇచ్చింది. 5 రోజుల్లోగా సిట్ ఎదుట హాజరు కావాలని తేల్చి చెప్పింది. అటు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజ్వల్‌ని వదిలిపెట్టమని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఈసారి బీజేపీ, జేడీఎస్‌ కలిసి పోటీ చేయడం..జేడీఎస్ ఎంపీ అయిన ప్రజ్వల్‌పై ఇలాంటి ఆరోపణలు రావడమే కీలకంగా మారింది. 


Also Read: PM Modi: మొదటి వంద రోజుల్లోనే మోదీ మార్క్, అధికారంలోకి వచ్చీ రాగానే కీలక నిర్ణయాలు