Jammu Kashmir: 


ఆ ప్రాంతంలోనే దాడులు..


జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడికి కుట్ర జరుగుతోందా..? నిఘా వర్గాలు ఇదే చెబుతున్నాయి. భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులు అటాక్‌ చేయాలని చూస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ అటాక్‌కి ప్లాన్ చేస్తోందని తేల్చి చెప్పాయి. ఆత్మాహుతి దాడులతో పాటు గ్రనేడ్ దాడులకూ ప్రణాళికలు రచించినట్టు వెల్లడించాయి. భద్రతా బలగాలతో పాటు స్థానికేతర కార్మికులను టార్గెట్‌గా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేయాలని చూస్తున్నట్టు చెప్పాయి. ఈ హెచ్చరికలతో సెక్యూరిటీ ఒక్కసారిగా అలెర్ట్ అయింది. బారాముల్లాతో పాటు కశ్మీర్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడే దాడులు జరుగుతాయన్న అనుమానంతో భద్రత పెంచారు. శ్రీనగర్‌లోనూ సెక్యూరిటీ టైట్ చేశారు. గ్రనేడ్‌లతో దాడులు చేస్తారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో తనిఖీలు చేపడుతున్నారు. 


తరచూ ఘర్షణలు..


ఇప్పుడే కాదు. గతంలోనూ చాలా సార్లు ఇలా ప్లాన్ చేసి మరీ దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. అందుకే...భద్రతా బలగాలు స్ట్రాటెజీ మార్చి వాళ్లను మట్టుబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నిఘా వర్గాలను మరింత యాక్టివ్‌గా ఉంచడంతో పాటు మిలిటరీని బలోపేతం చేయాలని చెబుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో పూంఛ్, రాజౌరీల్లో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. 18 నెలలుగా ఇక్కడ సైన్యం, ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2021 అక్టోబర్ 11 నుంచి ఇప్పటి వరకూ 8 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 26 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇలాగే కొనసాగితే...కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోనే ఎక్కువగా దాడులు జరుగుతుండడం వల్ల ఆ ప్రాంతాల్లోనే భద్రత పెంచుతున్నారు. 


ఎన్‌కౌంటర్..


ఇటీవలే జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 5గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను ఏరివేయాలనే లక్ష్యంతో నిత్యం నిఘా పెడుతోంది ఇండియన్ ఆర్మీ. నిఘా వర్గాల సమాచారం మేరకు ఆపరేషన్‌లు చేపడుతోంది. ఈ క్రమంలోనే రాజౌరిలోని కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. మే 3వ తేదీన జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు జవాన్లు. ఓ ట్రక్‌లో వెళ్తుండగా ఉన్నట్టుండి ముష్కరులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించినా...లాభం లేకుండా పోయింది. కాసేపటికే వాళ్లూ మృతి చెందారు. దీనికి బదులు తీర్చుకునేందుకు సైనికులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉగ్రకదలికలను గమనించిన ఆర్మీ...మొత్తానికి వాళ్ల స్థావరాన్ని కనుగొంది. ఓ గుహలో వాళ్లు దాక్కున్నట్టు గుర్తించింది. చుట్టూ కొండలు,గుట్టలు ఉన్నాయి. ఇంతలో సైనికుల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇరువైపులా ఎన్‌కౌంటర్ మొదలు కాగా...అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బాంబు దాడి చేశారు. ఈ బాంబు ధాటికి ఇద్దరు జవాన్లు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Attack On Red Fort: ఎర్రకోటపై దాడికి ప్లాన్ చేసిన ISI,సంచలన విషయాలు చెప్పిన పోలీసులు