ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొరబడి నెత్తుటేరులు పారించిన హమాస్‌ ఉగ్రమూకల స్థావరాలను శిథిలాల కుప్పగా మారుస్తామని ప్రతినబూనిన ఇజ్రాయెల్‌.. గాజాపై భీకర దాడులు చేస్తోంది. తమ దేశంలో పోయిన ప్రతీ ప్రాణానికి ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్ ఉగ్రమూకలకు కేంద్రంగా మారిన గాజా స్ట్రిప్‌పై నిర్విరామంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా గజగజ వణికిపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా... మరింత సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలను  అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు పంపింది. ఇప్పుడు హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. అమెరికా దేశానికి చెందిన అత్యంత అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇజ్రాయెల్ దేశానికి చేరింది. సముద్రంలో అత్యంత ప్రమాదకరమైనది ఈ యుద్ధ నౌకకు పేరుంది. ఇది ఇజ్రాయెల్‌కు మద్దతుగా తన పని ప్రారంభిస్తే హమాస్‌ దళాలు ఎదుర్కోవడం కష్టమన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. 

 

అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక శత్రు సేనల పట్ల అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన ఈ యుద్ధ నౌకకు యునైటెడ్ స్టేట్స్ యొక్క 38వ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ పేరు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నావికా సేవలో పసిఫిక్ థియేటర్‌లోని తేలికపాటి విమాన వాహక నౌక మోంటెరీలో యుద్ధ విధులు నిర్వర్తించింది.  యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడంతోపాటు హమాస్‌కు అదనపు ఆయుధాలను సమకూర్చే వారిపై నిఘా ఉంచనుంది. 

 

ప్రస్తుతం అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఈ యుద్ధనౌకలో యూఎస్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ భారీ ఆయుధాలున్నాయి.  నౌకా నిరోధక క్షిపణులు ఉన్న ఈ వార్ షిప్ శత్రువులతో భీభత్సంగా పోరాడే సామర్ధ్యం కలది. ఈ నౌకలో విమాన వాహక నౌకతోపాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్, యూఎస్ఎస్ నార్మాండీ, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రామేజ్, యూఎస్ఎ స్యూఎస్ఎస్ కార్నీ, యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్ ఉన్నాయని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్, యూఎస్ వైమానిక దళం ఎఫ్-15, ఎఫ్-16, ఎ-10 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ స్క్వాడ్రన్‌లను పెంచడానికి సైన్యం చర్యలు తీసుకుంది అని  చెప్పారు.ఈ నౌక భారీ వైమానిక బాంబు దాడులతో ప్రతిస్పందించింది. ఇజ్రాయెల్ పౌరులను రక్షించడానికి, భయంకరమైన తీవ్రవాద దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి యూఎస్ యుద్ధ నౌక ఉపయోగపడనుంది.

 

యుద్ధం మొదలైన వెంటనే  అమెరికా ఇజ్రాయెల్ కు తన మద్దతు ప్రకటించింది.  బాధిత దేశానికి  అండగా ఉండేందుకు  యుద్ధ నౌకలు, విమానాలను పంపుతున్నామని అమెరికా  అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ విషయంపై   అమెరికా డిఫెన్స్ విభాగం ‘పెంటగాన్’  కూడా ప్రకటన చేసింది. తెలిపింది. నౌకలు, విమానాలు తమ కొత్త స్థావరాలకు కదలడం ప్రారంభించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం మధ్యాహ్నమే  ధృవీకరించింది.

  ఇప్పటికే వందలమంది హమాస్‌ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఇజ్రాయెల్‌.. అమెరికా అండదండలతో గాజాలోని  ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టేయాలని భావిస్తోంది. అవసరమైతే ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో కాలు మోపుతాయని కూడా తెలుస్తోంది. అదే జరిగితే హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపు దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.