స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిలు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీంతో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి విచారణ జరపనున్నారు. రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్ లో వెల్లడించారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందని పిటిషన్ లో తెలిపారు. 


మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. కస్టోడియల్‌ ఇంట్రాగేషన్‌ అవసరం లేదని, ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందన్నారు చంద్రబాబు. తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్ ను కొట్టేసిందని  ప్రజా జీవితంలో ఉన్నానని తెలిపారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని,దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు.


స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏంటి ?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నెలరోజులకు పైగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నాయి. ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. 


అమిత్ షాను కలిసిన నారా లోకేశ్


మరోవైపు నారా లోకేశ్,కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్నారని వివరించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు ? నీపై ఎన్ని కేసులు పెట్టారని లోకేశ్ ను అడిగారు అమిత్ షా. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల వివరాలు అమిత్ షాకు చెప్పారు. అదేవిధంగా ట్రయిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన విచారణలను అమిత్ షాకి చెప్పారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు అమిత్ షా.