ISIS Terrorist Arrest: 


ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎఫ్‌ఎస్‌బీ..


భారత్‌లో ఓ ప్రముఖ నేతపై ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసిన ఓ ఉగ్రవాదిని రష్యా అరెస్ట్ చేసింది. ఈ మేరకు రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) ప్రకటించింది. అరెస్టైన వ్యక్తి ఐసిస్‌ టెర్రరిస్ట్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదిగా గుర్తించారు. "రష్యాలో నిషేధిత ఐసిస్ గ్రూప్‌నకు చెందిన ఉగ్రవాదిని ఎఫ్‌ఎస్‌బీ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాది..భారత్‌లోని ఓ ప్రముఖ నాయకుడిని చంపేందుకు కుట్ర పన్నాడు" అని రష్యా ప్రతినిధులు వెల్లడించారు. టర్కీలో ఈ వ్యక్తిని సూసైడ్ బాంబర్‌గా రిక్రూట్ చేసుకుంది ఐసిస్. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర ప్రభుత్వం..ఐసిస్‌ను ఉగ్రసంస్థగా నోటిఫై చేసింది. ఈ సంస్థ తన సిద్దాంతాలను వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా వేదికలను వినియోగిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాయని...కేంద్ర మంత్రి వర్గాలు తెలిపాయి. ఆ సంస్థపై చట్ట పరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశాయి.


ఐసిస్‌పై అగ్రరాజ్యం పోరాటం..


రష్యాతో పాటు అమెరికా కూడా ఐసిస్‌పై గట్టిగా పోరాడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసిస్ అధినేతను అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాద వ్యతిరేక ఆపరషేన్‌లో ఐసిస్ చీఫ్‌ అబు ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషిని అమెరికా సైన్యం హతమార్చింది. ఈ మేరకు అమెరికాక అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సిరియాలో అంతర్గత వలసలు ఎక్కువగా ఉండే ఇడ్లిబ్ రాష్ట్రంలోని అత్మేహ్ అనే గ్రామంపై అమెరికా దళాలు మెరుపు దాడులు జరిపాయి. ఈ దాడిలో ఐఎస్​ఐఎస్​ నాయకుడితో పాటు 13 మంది పౌరులు కూడా మరణించారు. ఇడ్లిబ్​ ప్రాంతం ఉగ్రమూకలకు స్థావరంగా మారింది. ఇక్కడ ఉగ్రకార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. ఈశాన్య సిరియాలో ఓ జైలును స్వాధీనం 
చేసుకోవడానికి 10 రోజుల పాటు ఉగ్రవాదులు దాడులు చేశారు. అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు దాడులతో తాలిబన్లకు తలనొప్పి తెచ్చింది ఇస్లామిక్​ స్టేట్ (ఐసిస్)​. ముఖ్యంగా తాలిబన్లే లక్ష్యంగా వారి వాహనాలపై దాడులకు తెగబడుతోంది. తాలిబన్​- ఇస్లామిక్​ స్టేట్​ మధ్య శత్రుత్వం కొత్తేమీ కాదు. అమెరికా దళాలు వెనుదిరగక ముందు నుంచే వీరి మధ్య శత్రుత్వం ఉంది. రెండు వర్గాలు కఠిన ఇస్లాం నిబంధనలు పాటిస్తాయి. కానీ వీరి సిద్ధాంతాల్లో కొంత వ్యత్యాసం ఉంది.


అఫ్గానిస్థాన్​పై పట్టు కోసం తాలిబన్లు ఇన్నేళ్లు శ్రమించగా.. అంతర్జాతీయంగా 'జిహాద్​' కోసం ఐఎస్​ పిలుపునిచ్చింది. అమెరికా, నాటో దళాలు వెనుదిరగక ముందే.. మెరుపు వేగంతో కాబుల్​ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. దేశాన్ని వీడేందుకు ప్రజలు ప్రయత్నిస్తోన్న సమయంలో కాబూల్​ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు పాల్పడింది ఐసిస్​-కే. ఈ ఘటనలో అమాయక ప్రజలు, తాలిబన్​ ఫైటర్లు, అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో ఓ మసీదులో బాంబు జరిగింది. ఇది కూడా ఐసిస్‌ పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలతో.. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. 


Also Read: అమిత్‌షాకు చెప్పులు అందించిన బండి సంజయ్‌- వీడియో షేర్‌ చేస్తూ షేక్ చేస్తున్న ప్రత్యర్థులు


Also Read: AP BJP Vishnu : షా, ఎన్టీఆర్ భేటీతో రాజకీయాల్లో కీలక మార్పులు - వైఎస్ఆర్‌సీపీ అవినీతిపై చర్చకు సిద్ధమన్న విష్ణువర్ధన్ రెడ్డి !