కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానం వద్ద జరిగిన సంఘటన పెను దుమారం రేపుతోంది. పూజలు చేసి బయటకు వస్తున్న అమిత్‌షాకు పరుగుపరుగు వెళ్లిన చెప్పులు అందిస్తారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌. ఇది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా పెట్టారు. 


ఈ వీడియోతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ పెరిగిపోయంది. దీనిపై ప్రత్యర్థులు కామెంట్స్‌ జోరు పెంచారు. ఓవైపు టీఆర్‌ఎస్‌ మరోవైపు కాంగ్రెస్‌ విమర్శలకు పని చెప్పాయి.


ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న  నాయకున్ని -  తెలంగాణ  రాష్ట్రం గమనిస్తోందని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉందని తన ట్విట్ట్‌లో రాసుకొచ్చారు. 






కెసిఆర్ రైతు వ్యతిరేకి అని అమిత్‌షా అనడంపై కేటీఆర్‌ మండిపడ్డారు. అది ఈ శతాబ్దపు జోక్‌గా అభివర్ణించారు. ఒకవైపు కేసీఆర్ ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను కాపీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి మంచి పథకాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పిఎం కిసాన్‌గా పేరు మార్చింది ఎవరని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 


రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత.. వ్యతిరేకత ఎక్కువయ్యేసరికి క్షమాపణ చెప్పింది ఎవరని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫసల్ బీమా యోజనలో చేరలేదని కెసిఆర్‌ను విమర్శిస్తున్న అమిత్ షా... ఆ పథకం గుజరాత్‌లో ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. ఆ రాష్ట్రం ఎందుకు ఆ పథకం నుంచి వైదొలగిందో చెప్పాలన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఎలా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలన్నారు. ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని అమిత్ షా వదిలిపెట్టాలని కేటీఆర్ సూచించారు. 


అటు కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోందీ వీడియోపై. తెలంగాణ ఆత్మగౌరవం ఒకప్పటి తడీపార్ కాళ్ళ వద్ద పెట్టిన బండి సంజయ్‌ అంటు సెటైర్లు వేస్తూ ట్వీట్‌లతో విమర్శలకు పనిచెప్పింది. నేతల కట్టు బానిసత్వానికి పరాకాష్ట ఈ వీడియో అని... ఇంత నీచమా బీజేపీలో మీ బ్రతుకులు అంటూ ఘాటుగా స్పందించింది. మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడే చెప్పులు మోస్తుంటే, మిగతవారు ఇంకేమి పనులు చెయ్యాలో అంటు ప్రశ్నించిందా పార్టీ.