Iran Hijab Row: 


బులెట్‌లతో అడ్డుకుంటున్న ప్రభుత్వం..? 


ఇరాన్‌లో హిజాబ్‌పై పెద్ద ఎత్తు నిరసనలు కొనసాగుతున్నాయి. ఏడేళ్లు పైబడిన మహిళలందరూ తప్పనిసరిగా హిజాబ్ ధరించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం నిబంధన అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి దీనిపై మహిళలు నిరసిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ యువతి ఈ గొడవల్లోనే చనిపోయింది. పోలీసులే ఆమెను కస్టడీలో హింసించి చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే..ఇప్పుడు ఓ షాకింగ్ రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ ఆందోళనల్లో 31 మంది మృతి చెందారని తేల్చి చెప్పింది ఈ నివేదిక. "ఇరాన్ పౌరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వాళ్ల ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం వీరిని బులెట్‌లతో అడ్డుకోవాలని చూస్తోంది" అని ఇరాన్ హ్యూమన్ రైట్స్ (IHR) డైరెక్టర్ మహమూద్ అమిరి వెల్లడించారు. దాదాపు ఆరు రోజులుగా అక్కడ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. దేశంలోని దాదాపు 30 కీలక నగరాల్లో మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. నార్తర్న్‌ ప్రావిన్స్ కుర్దిస్థాన్‌లో ఈ నిరసనలు మొదలయ్యాయి. అక్కడి నుంచి దేశమంతా పాకాయి. అర్మోల్‌ సిటీలో బుధవారం రాత్రి 11 మంది చనిపోయారని చెబుతోంది IHR.బబోల్ అనే మరో సిటీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరిస్తోంది. 


విచారణ జరిపిస్తాం: ప్రెసిడెంట్ ఇబ్రహీం 


ఈ వివాదంపై ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పందించారు. మొరాలిటీ పోలీసుల కారణంగా ఓ యువతి చనిపోయిందన్న ఆరోపణలను సరైన విధంగా విచారించేలా చర్యలు చేపడతామని చెప్పారు. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి హాజరైన సమయంలో మీడియా ఆయనను ప్రశ్నించింది. ఆమె గుండెపోటుతో మరణించిందన్న ప్రస్తావన రాగా...యూఎస్, యూకేలోనూ ఇలాంటి కస్టడీ డెత్స్‌ నమోదయ్యాయని వ్యాఖ్యానించారు. వాటిపైనా విచారణ జరిపించారా..? అని ఎదురు ప్రశ్న వేశారు ఇబ్రహీం. పాశ్చాత్య దేశాలు మానవ హక్కుల విషయంలో రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాయని విమర్శించారు. "ఏదేమైనా ఇది కచ్చితంగా విచారణ జరపాల్సిన విషయం. ఆ యువతి చనిపోయిందని తెలిశాక ఆ కుటుంబంతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. విచారణ జరిపిస్తానని వాళ్లకు హామీ కూడా ఇచ్చాను" అని చెప్పారు. 


జుట్టు కత్తిరించుకు నిరసనలు..


నిరసనలతోనే మహిళలు ఆగిపోలేదు. తమ జుట్టుని కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇప్పుడిదో ఉద్యమంలా మారింది. ఇరాన్ మహిళలంతా తమ జుట్టుని కట్ చేసుకుని, తరవాత హిజాబ్‌లను మంటల్లో తగలబెడుతున్న వీడియోలు షేర్ చేస్తున్నారు. హిజాబ్‌లకు వ్యతిరేకంగా ఇలా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహ్‌సా అమినిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో తీవ్రంగా హింసించారని, ఆ బాధ తట్టుకోలేకే ఆమె చనిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. అయితే...పోలీసులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. ఆమెకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని వివరిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మహ్‌సా అమిని పూర్తి ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనిపైనే...మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన వారిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. హిజాబ్‌ను ధరించని మహిళలకు కఠినశిక్ష అమలు చేయాలని రూల్స్ పాస్ చేశారు. అక్కడి మహిళలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా హిజాబ్‌లను తొలగిస్తున్నారు.  


Also Read: Congress President Election: 'ఎంత చెప్పినా రాహుల్ ఒప్పుకోలేదు- అందుకే పోటీ చేస్తున్నా'