PM Modi Australia Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. బుధవారం (మే 24) ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


సమావేశం అనంతరం ఇరు దేశాలు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దీనితో పాటు క్రికెట్ ప్రపంచ కప్‌ కోసం భారత్‌కు రావాల్సిందిగా ఆంథోనీ అల్బనీస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆహ్వానించారు. ఇరువురు నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


ఎంఓయూపై సంతకం చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. క్రికెట్ పరంగా భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు టీ20 మోడ్‌కి మారాయన్నారు. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజమే రెండు దేశాల మధ్య సజీవ వారధి అని చెప్పుకొచ్చారు. ఈరోజు ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో చర్చలు జరుపుతున్నామని.. దశాబ్దంలో తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం గురించి మాట్లాడుకున్నట్లు వివరించారు. కొత్త రంగాలలో పరస్పర సహకారానికి గల అవకాశాల గురించి వివరంగా చర్చించారు.


దేవాలయాలపై దాడుల అంశం..


ద్వైపాక్షిక భేటీలో ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడుల అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రధాని అల్బనీస్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు, వేర్పాటువాదుల కార్యకలాపాలపై ఇంతకు ముందు కూడా మాట్లాడామని, ఈరోజు కూడా మాట్లాడామని చెప్పారు. ఇలాంటి చర్యలతో భారతదేశం - ఆస్ట్రేలియా సంబంధాలను చెడగొట్టలేరని చెప్పారు. దేవాలయాలపై దాడుల విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని తీసుకున్న చర్యలకు తాను ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.


ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో సందర్శకుల పుస్తకంపై ప్రధాని మోదీ సంతకం చేశారు.






ఆస్ట్రేలియాలో ఉ్న భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని


మంగళవారం సిడ్నీలోని ఎరీనా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ మెగా షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 20000 మందికి పైగా భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో.. ప్రధాని మోదీ పరస్పర విశ్వాసం, గౌరవం, ఆస్ట్రేలియా-భారతదేశం మధ్య లోతైన సంబంధానికి పునాదిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులకు క్రెడిట్ ఇచ్చారు. ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ.. ఇంతకు ముందు, భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను 3C, కామన్వెల్త్, క్రికెట్ మరియు కర్రీ ద్వారా నిర్వచించారని చెప్పారు. అప్పుడు మఈ రెండు దేశాల మధ్య సంబంధాన్ని 'ప్రజాస్వామ్యం, డయాస్పోరా స్నేహంగా' నిర్వచించారని తెలిపారు. కొంతమంది తమ సంబంధం  ఇ-ఎనర్జీ, ఎకానమీ మరియు విద్యపై ఆధారపడి ఉంటుందిని కూడా పేర్కొన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధం దీనికి అతీతం అని తాను నమ్ముతున్నట్లు.. ఇది పరస్పర విశ్వాసం, గౌరవంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. 


మంగళవారం సిడ్నీలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ సమావేశాల సందర్భంగా, సాంకేతికత, నైపుణ్యాలు, క్లీన్ ఎనర్జీ వంటి రంగాలలో భారతీయ పరిశ్రమతో సహకారాన్ని పెంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.