అమలాపురానికి చెందిన రాజేష్ ఉపాధి నిమిత్తం గల్ప్ వెళ్లేందుకు పాస్ పోర్ట్ చేయించుకున్నాడు.. గల్ప్ దేశానికి సంబంధించి వీసా కూడా వచ్చింది.. ఈ ప్రయత్నంలో భాగంగా మెడికల్ కోసం హైదరాబాద్ వెళ్లాడు.. తిరిగి వచ్చే క్రమంలో బ్యాగ్ పోగొట్టుకున్నాడు. అందులో పాస్పోర్ట్ కూడా ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక నెట్ సెంటర్ను ఆశ్రయిస్తే మళ్లీ కొత్తది అప్లై చేసుకోమని సలహా ఇచ్చి స్లాట్ బుక్ చేసి ఇచ్చాడు.. తీరా పాస్పోర్ట్ కేంద్రానికి వెళితే రిజెక్ట్ చేశారు. ఇంతకుముందు పాస్పోర్ట్ ఉందని వెనక్కు పంపారు. రాజేష్ దగ్గర కనీసం పాస్పోర్ట్ ఫోటో కాపీ కానీ, పాస్పోర్ట్ నెంబర్ కూడా లేదు.
ఇలా చాలామంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉండుంటారు.. కొంత మంది అవగాహన రాహిత్యం వల్ల పాతపాస్ పోర్టు ఉన్నప్పటికీ కొత్తగా అప్లై చేసి డబ్బు, సమయం వృధా చేసుకుంటున్నారు.. అయితే పాస్పోర్ట్ పోగొట్టుకున్న వ్యక్తి దగ్గర కనీసం పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ లేకపోయినా పాస్పోర్టు మళ్లీ పొందవచ్చు అంటున్నారు అధికారులు.
పాస్పోర్ట్ పోగొట్టుకుని కనీసం కాపీ కూడా లేకపోతే..
పాస్పోర్ట్ పోగొట్టుకుని కనీసం మనదగ్గర ఫోటో కాపీ కూడా లేకపోతే మీ ప్రాంతీయ కార్యాలయానికి తప్పని సరిగా వెళ్లాల్సి ఉంటుంది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్(ఆర్పీవో)లు ఇవి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లో ఉన్నాయి. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది పూర్తిగా వ్యక్తిగత గోప్యతతో కూడుకున్న అంశం కాగా ఇది ఆన్లైన్లో వివరాలు లభించవు. వెంట ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.. పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయంలో సిబ్బంది ఒక దరఖాస్తును ఇస్తారు. దాంట్లో మీ పేరు, తండ్రి పేరు, భర్త లేదా భార్య పేరు, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ నింపి ఆధార్కార్డు జిరాక్స్ కాపీతో సిబ్బందికి అందజేస్తే అది దృవీకరించి ఇంకో సెక్షన్కు పంపిస్తారు. అక్కడ మనం దరఖాస్తులో ఇచ్చిన వివరాలతోపాటు ఆధార్ వివరాలు వాళ్ల లాగిన్లో పున పరిశీలన చేసి ఆపై మన పాస్పోర్ట్ నెంబరు, ఇతర వివరాలతో ఉన్న పాస్పోర్ట్ కాపీను మనకు అందిస్తారు. ఈ నకలు పోలీస్ ఎఫ్ఐఆర్ కోసం మాత్రమే అన్న డిక్లరేషన్ తీసుకుని కాపీను అందజేస్తారు..
మీసేవా ద్వారా ఫిర్యాదు..
పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయంలో తీసుకున్న కాపీ జిరాక్స్లో ఉన్న వివరాలు ప్రకారం పాస్పోర్ట్ ఎక్కడ, ఏవిధంగా పడేసుకున్నామో ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్లో మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మీ సేవా ఆన్లైన్ పోర్టల్ ద్వారా రూ.1150 చెల్లించి దరఖాస్తు చేస్తే అక్కడి నుంచి ఫిర్యాదు సంబందిత పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఎస్సై ఎంక్వైరీ అనంతరం ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్తుంది. ఆయన ధృవీకరణతో మళ్లీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. మన సెల్ఫోన్కు విచారణ పూర్తయ్యి దృవీకరణ పత్రం సిద్ధం అయినట్లు మెసేజ్ వస్తుంది. ఈప్రక్రియకు సుమారు 20 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. మీసేవా ద్వారా జారీ అయిన పోలీస్ ఎంక్వయిరీ సర్టిఫికెట్తో ఆన్లైన్లో పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా పాస్పోర్ట్ దరఖాస్తు ఇలా...
పాస్పోర్ట్ కొత్తగా దరఖాస్తు చేసుకున్నా లేదా రీ ఇష్యూ కోసం చేసుకున్నా అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. మెయిల్ ద్వారా ఐడీ క్రియేట్ చేసుకుని ఆ ఐడీలో వివరాలన్నీ పూర్తిచేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.. అనంతరం స్లాట్ బుకింగ్ కోసం కింద అపాయింట్మెంట్ అని క్లిక్ చేస్తే ఏఏ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏ రోజున స్లాట్ బుకింగ్ అవకాశం ఉందో చూపిస్తుంది. మనకు నచ్చిన డేట్ నిర్ధారించుకుని ఆపై ముందుకు వెళితే యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ రూ.1500 చెల్లిస్తే పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే ఆటోమెటిక్గా మనం ఎంపిక చేసుకున్న డేట్కు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అవుతుంది. ఇది 36 పేజీల పాస్పోర్ట్కు మాత్రమే అదే 60 పేజీలు పాస్పోర్ట్ అయితే రూ.2000 చెల్లించాలి. దానిని ఫ్రింట్ తీసుకుని సంబందిత ఇతర డాక్యుమెంట్స్(ఒరిజినల్) తో కలిసి మనం ఎంపిక చేసుకున్న పాస్పోర్ట్ సేవాకేంద్రానికి స్లాట్లో ఇచ్చిన సమయానికి వెళితే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
ఇదే పద్దతిలో తత్కాల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి 36 పేజీల పాస్పోర్ట్ కోసం రూ.3500, 60 పేజీల పాస్పోర్ట్ కోసం రూ.4000 చెల్లించాల్సి ఉంటుంది.. ఈ మొత్తం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసేటప్పుడు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.