కేంద్ర ప్రభుత్వం వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది. కాలం చెల్లిన, కాలుష్య కారక వాహనాలను తొలగించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. మెల్లమెల్లగా పాత, అన్ ఫిట్ వాహనాలను తొలగించడమే ఈ పాలసీ లక్ష్యం. మీ వాహనాల రిజిస్ట్రేషన్ పరిమితికాలం పూర్తి కాగానే స్క్రాపేజ్‌ పాలసీ అమలులోకి వచ్చేస్తుంది. తరువాత ఆ వాహనాలకు ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహిస్తారు. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం వాణిజ్య వాహనాలు 15 సంవత్సరాల తర్వాత, ప్రైవేట్ వాహనాలు 20 సంవత్సరాల వరకు పరిమితి ఉంటుంది. ఈ టైమ్ తర్వాత వాహనాలు వాతావరణ కాలుష్యానికి, ప్రమాదాలకు దారి తీస్తాయి. అయితే ఈ పాలసీతో వాహనాలను రీసైక్లింగ్ చేసేందుకు, వినియోగించే వ్యక్తులు ప్రోత్సహకాలను కూడా అందిస్తారు. 


ఏంటీ ఈ స్క్రాప్ విధానం


వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం.. వాహనం వయస్సుతోపాటు ఫిట్‌నెస్ పరీక్ష కూడా చేస్తారు. అనర్హమైనది అయితే స్క్రాప్ చేస్తారు. అయితే ఈ పాలసీ నుంచి వాహన యజమానులు నగదును పొందడమే కాకుండా, ప్రభుత్వం నుంచి కొత్త కారు కొనుగోలుపై రాయితీ కూడా వస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ పాలసీపై ప్రకటన చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఉపాధి కల్పన, ఆర్థిక ప్రయోజనాలతో వెహికల్‌ స్క్రాపేజ్‌ పాలసీని ప్రతిపాదించారు. ఈ పాలసీ వల్ల దేశంలో నిరుపయోగంలో ఉన్న వాహనాలు తుక్కుగా మారిపోనున్నాయని తెలిపారు.


దేశంలో 20 ఏళ్లు దాటిన వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లు దాటిన వాహనాలు 34 లక్షల ఉన్నాయి. సిస్టమాటిక్ పద్ధతిలో రీసైక్లింగ్ చేయడం వల్ల స్టీల్, ప్లాస్టిక్, రాగి వంటివి తిరిగి ఉపయోగించుకోవచ్చు. దీంతో తయారీ వ్యయం తగ్గుతుంది. ఈ పాలసీ వల్ల కొత్త అమ్మకాలు ప్రోత్సహించినట్లు అవుతుంది.


ఫిట్‌నెస్ టెస్టు సెంటర్లలో వాహనాల  అన్ని టెస్టులు చేసి పొల్యూషన్ స్థాయి ఏ లెవెల్ ఉందో కూడా నిర్ధారిస్తారు. టెస్ట్‌లో ఫెయిలయితే.. వాహనదారుడు తమ పాత వాహనాలను రిపేర్ చేయించి మూడుసార్లు టెస్ట్ నిర్వహించవచ్చు. స్క్రాపింగ్‌కు ఇవ్వాలనుకున్న వాహనదారులకు.. వెహికల్ ఎక్స్ షోరూం ధర ప్రకారం 4 నుంచి 6 శాతం ప్రోత్సాహకాలు అందుతాయి. రోడ్డు పన్ను నుంచి 25 శాతం, వాణిజ్య వాహనాల కొనుగోలు నుంచి 15 శాతం రాయితీ లభించనుంది.


స్టార్టప్ లు ఏర్పాటు చేయాలి


స్క్రాపింగ్ పాలసీ ఆవిష్కరించిన రోజున ప్రధాని మోదీ మాట్లాడారు. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త పాలసీని తీసుకువచ్చామని వివరించారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తీసుకువచ్చిన ఈ పాలసీ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. దశల వారీగా నిరుపయోగంగా ఉన్న వాహనాలను తగ్గించాలని ప్రధాని అన్నారు. ఇందు కోసం స్టార్టప్ లను ఏర్పాటు చేయాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు.