UP News: అప్పటికే వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. భర్తలతో కలిసి హాయిగా కాపురాలు కూడా చేసుకుంటున్నారు. అయితే వాళ్లందరికీ ఇల్లు లేకపోవడంతో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మొదటి విడతలో భాగంగా 50 వేల చొప్పున ఆ మహిళల అకౌంట్ లో పడ్డాయి. అంతే ఆ డబ్బులు తీసుకొని ఆ ఐదుగురు భార్యలు.. తమ ప్రియుళ్లతో పారిపోయారు. విషయం గుర్తించిన భర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగితా డబ్బులను వారి అకౌంట్లలో వేయొద్దని కోరుకుంటున్నారు. స్థానికంగా ఈ వార్త సంచలనం రేకెత్తిస్తోంది. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్రం 3 లక్షల రూపాయలు అందజేస్తోంది. ఇటీవల బారాబంకీ జిల్లా నుంచి 40 మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు ఎంపిక చేశారు. కొందరు మహిళల ఖాతాల్లో మొదటి వాయిదా కింద రూ.50,000 చొప్పున జమ చేశారు. ఖాతాల్లో నగదు జమ అవగానే ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో కలిసి వెళ్లిపోయారు. మరోవైపు రెండో విడత డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భార్యల ఖాతాల్లో జమ చేయొద్దని బాధిత భర్తలు అధికారులను కోరుతున్నారు. 


రెండు నెలల క్రితం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపిన భర్త


రెండు నెలల క్రితం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపించాడు ఓ భర్త. సుపారీ ఇచ్చి మరీ ఓ రౌడీషీటర్‌తో హత్య చేయించాడు. బైక్‌పై వెళ్తుండగా..కార్‌తో గుద్దించి హతమార్చాడు. ఈ దారుణం రాజస్థాన్‌లో జరిగింది. షాలు అనే మహిళ తన తమ్ముడితో కలిసి బైక్‌పై ఆలయానికి వెళ్తుండగా...ఓ కార్ వచ్చి బలంగా ఢీ కొట్టింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందగా...ఆమె బంధువుకి తీవ్ర గాయాలయ్యాయి. భర్త మహేశ్ చంద్...బైక్‌పై వెళ్లాలని మరీమరీ చెప్పడం వల్ల ఈ ప్రమాదానికి, అతనికి ఏమైనా సంబంధం ఉండొచ్చని మృతురాలి తరపున బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలీసులు విచారణ చేపట్టగా..తన భార్య పేరుమీదున్న రూ.1.90కోట్ల ఇన్సూరెన్స్ అమౌంట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు.. తానే ఈ హత్య చేయించినట్టు భర్త అంగీకరించాడు. అంతకు ముందు తానే తన భార్య పేరు మీద కోటి రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు. సహజంగా మరణిస్తే రూ.కోటి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా ప్రమాదంలో చనిపోతే రూ.కోటి 90 లక్షలు క్లెయిమ్ చేయొచ్చని కంపెనీ పాలసీలో ఉంది. ముకేష్ సింగ్ రాథోడ్ అనే ఓ రౌడీ షీటర్‌కు ఈ పని అప్పగించాడు. ఈ పని చేసేందుకు అతను రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ముందుగానే రూ.5.5 లక్షలు చెల్లించాడు. ఇదంతా పోలీసుల విచారణలో తేలింది. చంద్, షాలుకి 2015లో వివాహమైంది. ఓ పాప కూడా ఉంది. కానీ..పెళ్లైన రెండేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. షాలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. 2019లో తన భర్తపై గృహ హింస కేసు కూడా పెట్టింది. 


పక్కా ప్లాన్ ప్రకారం..


ఉన్నట్టుండి చంద్..తన భార్య పేరిట కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించాడు. సమస్యలన్నీ తీరిపోవాలంటే 11 రోజుల పాటు బైక్‌పై హనుమాన్ ఆలయానికి వెళ్లాలని చెప్పాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని జాగ్రత్త పడ్డాడు. తాను బలంగా ఓ కోరిక కోరుకుంటున్నానని, అది తీరిపోగానే ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఇది నమ్మిన ఆమె రోజూ తన కజిన్‌తో కలిసి ఆలయానికి వెళ్లేది. అక్టోబర్ 5న ఎప్పటిలాగే బైక్‌పై వెళ్తుండగా...ఓ కార్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఆ కార్ వెనకాలే చంద్‌ ఓ బైక్‌పై ఫాలో చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ప్రమాదం జరగ్గానే అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. ఈ కేసులో చంద్ రాథోడ్‌తో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలా ఇన్సూరెన్స్ కోసం హత్య చేయడం చాలా సాధారణమైపోయింది. ఎక్కడో ఓ చోట ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని హత్యలు చేయడమూ కామన్ అయిపోయింది. రోజూ ఏదో ఓ చోట ఇలాంటి దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.