Divya Ayodhya tourism app: లక్నో: శతాబ్దాల తరువాత అయోధ్యలో శ్రీరాముడు కొలువు దీరనున్నాడు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రతిష్ఠించనున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు రానున్నారు. అయితే అయోధ్యలో శ్రీరాముడి దర్శనం (Ayodhya Ram Mandir) కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా సరికొత్త యాప్ ను లాంచ్ చేశారు. అయోధ్య వివరాలు సమగ్రంగా తెలిపే దివ్య అయోధ్య (Divy Ayodhya) అనే యాప్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ సోమవారం విడుదల చేశారు. 


జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం 2.00 గంటలకు ముగుస్తుందని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయోధ్య రాముడ్ని దర్శించునేందుకు వచ్చే భక్తులు దివ్య అయోధ్య యాప్ ద్వారా అయోధ్యలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆలయాల గురించి తెలుసుకోవచ్చు. అయోధ్యకు వెళ్లే ముందు భక్తులు అయోధ్యలో హోమ్ స్టే, ఎల్ట్రిక్ కార్లు, బస్సులను, టూరిస్ట్ గైడ్, వీల్ ఛైర్, ఇతర వాహనాలను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో తెచ్చింది యూపీ ప్రభుత్వం. ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఐఫోన్ యూజర్లు దివ్య్ అయోధ్య యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. 


ఈ యాప్‌ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. హోమ్‌స్టే (పర్యాటకులకు ఇంట్లో ఒక గదిని అద్దెకు ఇవ్వడం), హోటళ్లు, గుడారాలు, వీల్‌ఛైర్‌ అసిస్టెంట్‌, గోల్ఫ్‌కార్ట్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులను, టూరిస్ట్‌ గైడ్‌లను ముందస్తు బుకింగ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలను నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి. యాప్‌లో నావిగేషన్ సౌకర్యం కల్పించారు. తప్పక చూడాల్సిన ప్రదేశాలు, టూర్‌ ప్యాకేజ్‌, స్థానిక వంటలు, వెహికల్ పార్కింగ్ లకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 


దివ్య అయోధ్య మొబైల్ యాప్‌ లో ఈ వివరాలు చెక్ చేసుకోండి
దివ్య అయోధ్య మొబైల్ యాప్ Android, iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది
1) దివ్య అయోధ్య మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యూజర్ ID, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఒకవేళ యూజర్ కొత్తవారైతే వివరాలను ఎంటర్ చేసి సైన్ అప్ కావాలి. 
2) లాగిన్ అయ్యాక.. అందులో టూర్ ప్యాకేజీ వివరాలు చెక్ చేసుకోవచ్చు. స్థానికంగా రుచికరమైన వంటకాలు, ఆలయాల వివరాలు, గోల్ఫ్ కార్ట్స్, ఆన్‌లైన్ పార్కింగ్ బుకింగ్ తదితర వివరాలు చూడవచ్చు


మరోవైపు, లక్నో నుంచి అయోధ్యకు విమాన కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యామ్నాయంగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తేవాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 19 నుంచి ఈ రెండు నగరాల మధ్య నడిపేందుకు యోగి సర్కార్ మొత్తం ఆరు హెలికాప్టర్లు ఏర్పాటు చేసింది.


పర్యాటకుల కోసం 50 ఎలక్ట్రిక్ బస్సులు, 25 గ్రీన్ ఆటోలు
అయోధ్య బస్టాండ్ నుంచి పర్యాటకుల కోసం 50 ఎలక్ట్రిక్ బస్సులు, 25 గ్రీన్ ఆటోలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదివరకే ప్రారంభించారు. ఈ-బస్సులు కొత్తగా నిర్మించిన ధరమ్ పాత్,  రామ్ పాత్ మార్గాల్లో సేవలు అందిస్తాయి. అయోధ్యలోని నాలుగు ప్రధాన మార్గాలలో రెండు మార్గాలు రామమార్గం, ధర్మపథ్. మిగిలిన రెండు మార్గాలు భక్తి మార్గం, జన్మభూమి మార్గం. మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్నాయి. అయోధ్యలో కాలుష్య నివారణతో పాటు భక్తులకు ప్రశాంతమైన వాతావరణం కనిపించనుంది.