Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణలోని గుంటూరు-బీబీనగర్‌, మహబూబ్‌నగర్‌-డోన్‌ మధ్య డబ్లింగ్‌, అలాగే ఒడిశాలోని ఖుర్దారోడ్డు నుంచి విశాఖపట్నం వరకు మూడోమార్గం నిర్మాణాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో కేంద్ర మంత్రివర్గం రూ.1,18,016 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. వచ్చే పదేళ్లలో 10వేల విద్యుత్తు బస్సులు ప్రవేశపెట్టడానికి రూ.57,613 కోట్లు, విశ్వకర్మ పథకానికి రూ.13వేల కోట్లు, డిజిటల్‌ ఇండియా విస్తరణకు రూ.14,903 కోట్లు, 9 రాష్ట్రాల్లో 2,339 కిలోమీటర్ల రైల్వే లైన్ల విస్తరణకు రూ.32,500 కోట్లు కేటాయించింది.  


తెలుగు రాష్ట్రాల్లో మూడు లైన్ల విస్తరణ
దేశవ్యాప్తంగా 7 రైలు మార్గాలను 2 నుంచి 4 వరుసల వరకు విస్తరించనున్నారు. గుంటూరు-బీబీనగర్‌  (239 కి.మీ), ముద్ఖేడ్‌-మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌-డోన్‌ (488 కి.మీ) మార్గాలను డబ్లింగ్‌ చేయనున్నారు. ఒడిశాలోని ఖుర్దారోడ్డు నుంచి విశాఖపట్నం వరకు మూడో మార్గం లైన్ నిర్మిస్తారు. గుంటూరు-బీబీనగర్‌ సెక్షన్‌ను విస్తరించేందుకు రూ.3,238 కోట్లు ఖర్చు చేయనున్నారు.  ఈ ప్రాజెక్టుతో చెన్నై-హైదరాబాద్‌ మధ్య 76 కిలోమీటర్లు, విజయవాడ - సికింద్రాబాద్‌ మధ్య 38 కిలోమీటర్ల  దూరం తగ్గుతుంది.


 చెన్నై - విజయవాడ - హైదరాబాద్‌ మధ్య మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. జగ్గయ్యపేట, జన్‌పహాడ్‌లలో ఉన్న సిమెంట్‌ కర్మాగారాలకు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ధాన్యం మిల్లులకు దీనివల్ల మేలు జరుగుతుంది. 239 కి.మీ. ప్రాజెక్టులో 100 కి.మీ. ఏపీ పరిధిలోకి, 139 కి.మీ. తెలంగాణ పరిధిలోకి వస్తుంది. కృష్ణానదిపై 458 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు


మహారాష్ట్రలోని ముద్ఖేడ్‌ నుంచి తెలంగాణలోని మేడ్చల్‌ వరకు, అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్‌- ఏపీలోని డోన్‌ మార్గాన్ని రూ.5,655 కోట్లతో డబ్లింగ్‌ పనులు చేపడతారు. మహారాష్ట్రలో 49 కి.మీటర్లు తెలంగాణలో 295 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 74 కిమీ డబ్లింగ్ చేయనున్నారు. ఈ పనులతో సికింద్రాబాద్‌-బెంగళూరు మధ్య 50 కిలోమీటర్లు తగ్గుతుంది. రోజూ కొత్తగా 50 రైళ్లు నడపడానికి వీలవుతుంది. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి దక్షిణాదికి రావడానికి 3-4 గంటల సమయం తగ్గనుంది.


ఒడిశాలోని నేరుగుండి-బరాంగ్‌, ఆ రాష్ట్రంలోని ఖుర్దారోడ్డు నుంచి విశాఖపట్నం వరకు 385 కి.మీ. మేర రూ.5,618 కోట్లతో మూడోలైను నిర్మిస్తారు. ఇందులో ఒడిశా భూభాగంలో 184 కిలోమీటర్లు, ఏపీ భూభాగంలో 201 కిలోమీటర్లు శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం మీదుగా విశాఖపట్నం వరకు మూడో లైన్ అభివృద్ధి చేయనున్నారు.  


విశాఖ రైల్వేజోన్‌‌పై సైలెన్స్
దీర్ఘకాలంగా పెండింగ్‌లో విశాఖ రైల్వేజోన్‌ ప్రస్తుత పరిస్థితి ఏమిటని విలేకరులు అడగ్గా సమాధానం ఇవ్వడానికి అనురాగ్‌ ఠాకుర్‌ నిరాకరించారు. అడిగే ప్రశ్న తాజా కేబినెట్‌ సమావేశానికి సంబంధించినదై ఉండాలని చెప్పారు.  


ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవ
కొత్త విద్యుత్తు బస్సులను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. 3 నుంచి 40 లక్షల జనాభా ఉన్న 169 నగరాల్లో 100 నగరాలను ఎంపిక చేస్తారు. 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాలకు 50 బస్సులు, 5-20 లక్షల జనాభా ఉన్న నగరాలకు 100 చొప్పున, 20-40 లక్షల జనాభా ఉంటే 150 బస్సులు చొప్పున కేటాయిస్తారు. పాత బస్సులను తుక్కుగా మార్చే నగరాలకు అదనపు బస్సులు ఇస్తారు. రూ.57,613 కోట్లలో కేంద్రం రూ.20 వేల కోట్లు సమకూరుస్తుంది. మిగతాది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో రాష్ట్రాలు సమకూర్చుకోవాలి. 


విద్యుత్తు బస్సుల నిర్వహణ, వసతుల కల్పన, డిపోల నిర్మాణం, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం సాయం, సహకారం అందిస్తుంది. మొబిలిటీకార్డు, ఇంటెలిజెన్స్‌ ట్రాన్సిట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ, విద్యుత్తు ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకయ్యే ఖర్చును కేంద్రం 100% అందిస్తుంది. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్ర రాజధానుల్లో బస్సులకు 90% మొత్తాన్ని కేంద్రం అందిస్తుంది. మిగిలిన నగరాలకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి.


డిజిటల్‌ ఇండియా పథకం కింద రూ.14,903 కోట్లు ఖర్చు చేయనున్నారు. 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఉమంగ్‌ యాప్‌ ద్వారా 540 అదనపు సేవలను అందుబాటులోకి తెస్తారు. మరో 9 సూపర్‌ కంప్యూటర్లను కొనుగోలు చేస్తారు. భాషిణి పోర్టల్‌ ద్వారా 22 భాషల్లోకి అనువాద సౌకర్యాన్ని తీసుకొస్తారు. 1,787 విద్యాసంస్థలను అనుసంధానించే నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ని ఆధునికీకరిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 1,200 అంకుర పరిశ్రమలకు సాయం చేస్తారు. 12 కోట్ల మంది కళాశాల విద్యార్థులకు సైబర్‌ అవగాహన కోర్సులు అందుబాటులోకి తెస్తారు.


కేంద్రం ఇటీవల విశ్వకర్మ పథకాన్ని ప్రకటించింది. రూ.13వేల కోట్లతో ఓబీసీలోని 18 కులాలకు సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, అవసరమైన పనిముట్ల కొనుగోలుకు రూ.15 వేలు చొప్పున అందించనుంది. తొలిదశలో రూ.లక్ష, మలిదశలో రూ.2లక్షల వరకు రుణమిస్తారు. దీనిపై వడ్డీ గరిష్ఠంగా 5% వరకు ఉంటుంది.