Uniform Civil Code in Uttarakhand: యూనిఫాం సివిల్ కోడ్‌(ఉమ్మ‌డి పౌర‌స్మృతి- UCC) దేశంలో కొన్ని ద‌శాబ్దాలుగా న‌లుగుతున్న విష‌యం. రాజ్యాంగం(Constitution)లోనూ దీనికి ఆమోదం ల‌భించింది. అయితే.. దీనిని అమ‌లు చేస్తే.. కొన్ని సామాజిక వ‌ర్గాలు, మ‌రికొన్ని మతాల వారికి ఇబ్బందులు వాటిల్లే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనేక ప‌ర్యాయాలు ఈ ప్ర‌తిపాద‌న‌ను తొక్కి పెట్టింది. కానీ, 2014లో కేంద్రంలో కొలువుదీరిన న‌రేంద్ర మోడీ(Narendra Modi) స‌ర్కారు.. అప్ప‌టి నుంచి ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమ‌లు చేయాల‌ని భావిస్తూనే వ‌చ్చింది. అయితే.. కొన్ని కార‌ణాల‌తో దీనిని ప‌క్క‌న పెట్టింది. అయితే, 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి ఉమ్మ‌డి పౌర్మృతిని ఏకంగా మేనిఫెస్టోలోనూ చేర్చారు. ఇలా.. కొన్నిద‌శాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న ఉమ్మ‌డి పౌర‌స్మృతి వ్య‌వ‌హారం.. బీజేపీ హ‌యాంలో అనేక విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, వాద ప్ర‌తివాదాల న‌డుమ పార్ల‌మెంటుకు చేరింది. 


2023లో..  
ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై 2023లో కేంద్రం(Centre)లోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది.  న్యాయ‌(లా) కమిషన్‌, న్యాయ మంత్రిత్వ శాఖల అభిప్రాయంతోపాటు.. అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న‌ట్టు తెలిపింది. అదే ఏడాది జూన్ 14 వ తేదీనే నోటీసులు జారీ చేసింది.  జులై 3 వ తేదీన లా కమిషన్‌, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఇందులో సభ్యుల అభిప్రాయాలు, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం వంటి అంశాలు చర్చించి.. చివ‌ర‌కు.. న‌వంబ‌రులో ఉమ్మ‌డి పౌర‌స్మృతిని కేంద్రం అంగీక‌రించింది. అయితే.. దీనిని అమ‌లు చేసుకునేందుకు ఎలాంటి గ‌డువు విధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో దీనిని రాష్ట్రాల‌కు వ‌దిలివేసింది. 


తొలి రాష్ట్రం ఇదే.. 
ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమ‌లు చేయ‌నున్న తొలి రాష్ట్రంగా దేవ‌భూమి ఉత్త‌రాఖండ్(Uttarakhand) నిలుస్తోంది. ఇటీవ‌ల రాష్ట్ర సీఎం పుష్క‌ర సింగ్ ధామీ ప్ర‌భుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. తాజాగా జ‌రుగుతు న్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీనిని మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే.. దీనికి విప‌క్షాల నుంచి అడ్డు త‌గిలింది. దీనికి రెండు కీల‌క‌మైన అంశాలు అవ‌రోధంగా మారాయి. ఒక‌టి.. స‌హ‌జీవ‌నం విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. ఆస్తుల పంప‌కం. ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. దాదాపు బిల్లుకు అసెంబ్లీ ఓకే చెప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే క‌నుక జ‌రిగితే దేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లు చేస్తున్న తొలిరాష్ట్రంగా ఉత్త‌రాఖండ్ నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 


అస‌లేంటీ ఉమ్మ‌డి పౌర‌స్మృతి? 
ఉమ్మడి పౌర స్మృతి చాలా క్లిష్టమైన విషయం. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి(Marriage), విడాకులు(Divorce), ఆస్థి పంప కాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​. దేశంలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక చట్టాన్ని తీసుకురావడమే దీనిని ఉద్దేశం. రాజ్యాంగంలో నూ ఆర్టికల్​ 44లో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు.. యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు.


అమ‌లు క‌ష్ట‌మే! 
యూనిఫాం సివిల్ కోడ‌ను చ‌ట్టం చేసినంత‌ మాత్రాన‌.. దానిని అమ‌లు చేయ‌డం అంత తేలిక కాదు. ఎన్నో మతాలు, విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, భిన్నత్వాలకు నెలవైన భారత దేశంలో.. చాలా అంశాలు మతాలు, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి.  హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకు వేరువేరుగా చట్టాలు ఉన్నాయి. పెళ్లి నుంచి విడాకుల వరకు, ఆస్థి పంపకం నుంచి డబ్బు విషయం వరకు అన్నింటికీ వేరువేరు చట్టాలు ఉన్నప్పుడు. వీరంద‌రినీ ఒకే గాటన క‌ట్టేస్తూ.. ఒకే చ‌ట్టం ప‌రిధిలోకి తీసుకురావ‌డం అన్న‌ది లౌకిక వాదానికి పెను స‌వాలుగా మారింది. ఉమ్మడి పౌర స్మృతితో లింగ సమానత్వం ఏర్పడుతుందని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని దీనిని స‌మ‌ర్థిస్తున్న వ‌ర్గాలు అంటున్నాయి.  కానీ, వ్య‌తిరేకిస్తున్న వారు దేశ లౌకిక భావ‌నకు ఇది పెను ప్ర‌మాద‌మ‌ని అంటున్నారు. 


ఈ చ‌ట్టాలు చాల‌వా? 
ప్ర‌స్తుతం దేశంలో మ‌తాల వారీగా కూడా చ‌ట్టాలు అమ‌ల‌వుతున్నాయి. వ్యక్తిగత చట్టాలు.. మతాల అనుగూణంగా ఉన్నాయని, వాటినే ప్రజలు అనుస‌రిస్తున్నారు. వీటి స్థానంలో యూసీసీని తీసుకొస్తే.. మైనారిటీలకు ఉన్న ప్రత్యేక హక్కులు బలహీనపడే ప్రమాదం ఉందని హేతువాదులు ఆరోపిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​ను రూపొందించినా.. క్షేత్రస్థాయిలో అమలు చేయడం కష్టమనే భావ‌న ఉంది.  ఏదేమైనా.. దేశంలో దీనిని అమ‌లు చేయ‌డం అంటే క‌త్తిమీద సామేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.