Bengal Woman Abused: ఢిల్లీలో దారుణం జరిగింది. బెంగాల్‌కి చెందిన ఓ మహిళపై బాయ్‌ఫ్రెండ్ వారం రోజుల పాటు అత్యాచారం చేశాడు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించాడు. వేడి వేడి పప్పు ఒంటిపై పోసి టార్చర్ చేశాడు. నిందితుడిని ఫిబ్రవరి 2వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్‌బెంగాల్‌లోని డార్జిలింగ్‌కి చెందిన మహిళ దాదాపు నెల రోజులుగా నిందితుడితోనే కలిసి ఉంటోంది. సౌత్ ఢిల్లీలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. జనవరి 30 వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ రోజే పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి ఓ కాల్‌ వచ్చింది. ఓ మహిళను తన భర్త దారుణంగా కొట్టి హింసిస్తున్నాడని స్థానికులు కాల్ చేసి చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు...వెళ్లి ఆ మహిళను రక్షించారు. ఆమె ఒంటిపై 20 గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే AIIMSకి తరలించి వైద్యం అందించారు. ఆ తరవాత ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక డిశ్చార్చ్ చేశారు. అయితే..ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్‌లో ఆ యువకుడితో పరిచయం అయిందని ఆ తరవాత ఇద్దరూ కలిసి ఒకే చోట ఉంటున్నామని బాధితురాలు వెల్లడించింది. జనవరి మొదటి వారంలో ఆమె బెంగళూరుకి వెళ్లాల్సి ఉంది. అక్కడే ఓ ఇంట్లో పని మనిషిగా ఉద్యోగం చేసేందుకు వెళ్లాలనుకుంది. ఢిల్లీమీదుగా రైల్ వెళ్తోందని అక్కడే దిగిపోయింది. తన ఫ్రెండ్‌ని కలవాలనుకుంది. అయితే...బాయ్‌ఫ్రెండ్‌ ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఢిల్లీలోనే ఉద్యోగం చూస్తానని తనతోనే ఉండిపోవాలని కోరాడు. అతడి మాటలు నమ్మి అక్కడే ఉండిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమెని వేధించడం మొదలు పెట్టాడు. అత్యాచారం చేశాడు. వేడి పప్పు ఒంటిమీద పోయడం వల్ల తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.