Tomato Price Hike: దేశంలో టమాటాల ధర విపరీతంగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే చాలా మంది ఎక్కడ టమాటాలు తక్కువ ధరకు దొరుకుతున్నాయో తెలుసుకొని మరీ వెళ్తున్నారు. దగ్గర్లోనే ఓ ఐదారు మార్కెట్లలో ఇలా చేస్తే విచిత్రమేమీ లేదు కానీ.. టమాటాల కోసం ఇతర దేశానికి వెళ్తే మాత్రం చెప్పుకోదగ్గ విషయమే. ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ జిల్లాలోని భారత్ - నేపాల్ రిహద్దు వెంబడి చాలా మంది ప్రజలు ఉంటున్నారు. అయితే వీరంతా మనం దేశంలో టమాటా ధరలు ఎక్కువగా ఉండడంతో నేపాల్ కు వెళ్లి మరీ టామాటాలు కొనుగోలు చేస్తున్నారు. నేపాల్ సరిహద్దులోని సమీప ప్రాంతాల్లో టనాటా ధరలు మన దేశంలోని ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపుగా సగం ధరకే లభిస్తున్నాయట. అందుకే ధార్చుల, బన్ బాసా నివాసితులు నేపాల్ వెళ్లి టమాటాలు తెచ్చుకుంటున్నారు. మన దగ్గర కిలో టమాటాలు రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. అదే నేపాల్ లో అయితే 62 రూపాయల నుంచి 69 రూపాయలకు మాత్రమే కిలో టమాటాలు వస్తున్నాయి. 


మరోవైపు దేశంలో టమోటా ధరలు విపరీతంగా మండిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటా కొనుగోలు చేసి ఎక్కువ ధరలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడకు పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది.







భారీ వర్షాలు కురుస్తుండడంతో పెరిగిన టమాటా ధరలు 


ఈక్రమంలోనే శుక్రవారం నాటికి ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అనేక చోట్ల కిలో టమాట ధర రూ.200కు చేరుకుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట దిగుబడి, సరుకు రవాణాలో అంతరాయం కారణంగా టమాటా ధర రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా టనాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి రిటైల్ కేంద్రాల్లో పంపిణీ చేయాలని భావిస్తోంది. 


మిగతా రాష్ట్రాలకు సరఫరా..!


దాదాపు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో టమోటా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ.. దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలు నుంచే దాదాపు 60 శాతం పండిస్తున్నాయి. వారు వాడుకోగా మిగిలిన ఉత్పత్తిని దేశంలోని మిగతా రాష్ట్రాల్లోకి సరఫరా చేస్తున్నారు. అలాగే ఆ ప్రాంతాల్లో ఉత్పత్తి సీజన్ లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గరిష్ట హార్వెస్టింగ్ కాలం ఉంటుంది. జులై నుంచి ఆగస్టు మరియు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుతం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమోటా సరఫరాలు అవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ మరియు సమీప నగరాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రస్తుతం టమాటాలు అందుతున్నాయి. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి కొత్త పంటలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. త్వరలోనే ఆ ధరలు అన్నీ తగ్గుతాయని చెప్పింది.