వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుపొందేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మరో ముగ్గుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే... ముగ్గుర్ని ఉప ముఖ్యమంత్రులుగా నియమించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ముగ్గురు ఉప ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, కట్టుబడి ఉంటానని సిద్ధరామయ్య తెలిపారు. 


లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని... మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని మంత్రి రాజన్న అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలిపారు. కొత్తగా మరో మూడు డిప్యూటీ సీఎంలను నియమించాలని డిమాండ్ చేశారు. వాటిని వీరశైవ-లింగాయత్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీలకు కేటాయించాలని కోరారు.  ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్‌ ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. కర్ణాటక  ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతున్నారని అన్నారు. 


దీనిపై స్పందించిన సిద్ధరామయ్య, నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమేనన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి సరిపోతారని హై కమాండ్‌ భావించింది కాబట్టే ఒకరిని నియమించిందన్నారు. డిప్యూటీ సీఎంల వ్యవహారం రాజన్న హైకమాండ్ తో మాట్లాడితే, తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రుల నియామకం గురించి చెప్పడానికి ప్రస్తుతం తన వద్ద ఎలాంటి సమాచారం లేదని సిద్ధరామయ్య తెలిపారు. హై కమాండ్‌ నిర్ణయమే తనకు శిరోధార్యమని వ్యాఖ్యానించారు. 


మంత్రి రాజన్న వ్యాఖ్యలను హోంమంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. గతంలోనే డిప్యూటీ సీఎం పోస్టు ఆశించిన పరమేశ్వర, రాజన్న మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్న వ్యక్తం చేసిన అభిప్రాయంతో హై కమాండ్‌ ఏకీభవిస్తుందో.. లేదో వేచి చూడాలన్నారు. దళిత నేతగా గుర్తింపు పొందిన పరమేశ్వర...గతంలో కేపీపీసీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా పని చేశారు. 


కర్ణాటకలో మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 224 స్థానాలు ఉన్న కర్ణాటకలో 135 స్థానాల్లో.. హస్తం పార్టీ జయభేరి మోగించింది. మళ్లీ అధికారంలోకి వస్తామని భావించిన బీజేపీ 66 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జేడీఎస్‌ 19 స్థానాలకే పరిమితంకాగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన సర్వోదయ కర్ణాటక పక్ష ఒక స్థానంలో గెలుపొందింది. ఈ విజయంతో 2013 తర్వాత స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బెంగళూరు, కోస్టల్‌ కర్ణాటకల్లో మాత్రమే.. కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది బీజేపీ.