Kashmir Encounter: కశ్మీర్ లోని అనంత్‌నాగ్‌ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ఐదో రోజుకు చేరుకున్నాయి. గాడోల్ లోని దట్టమైన అడవిలో వేలాది మంది పారా కమాండోలు, సైనికులు ఉగ్రవాదులను ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారు. జంగిల్ వార్‌ఫేర్‌ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు.. భద్రతా బలగలాను అరికట్టేందుకు, ఎన్‌కౌంటర్‌ ను పొడిగించేందుకు ప్రమాదకరమైన భూభాగాన్ని, అటవీ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


బుధవారం ఎదురుకాల్పులు ప్రారంభం కాగా.. ఇవాళ్టి వరకు అంటే 5 రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులు, దట్టమైన అడవిలో వ్యూహాత్మకమైన, వారికి అనుకూలమైన ప్రాంతంలో ఉండి ఎదురుకాల్పులు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు కొత్త పద్ధతిలో దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు. 


ఐదు రోజులుగా సాగుతున్న ఎన్‌కౌంటర్‌ లో భద్రతా బలగాలు.. వందలాది మోటారు షెళ్లు, రాకెట్లను ప్రయోగించాయి. హైటెక్ పరికరాలతో అనుమానిత ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అధునాతన డ్రోన్లను ఉపయోగించి పేలుడు పదార్థాలను జారవిడుస్తున్నాయి. 


ఇప్పటికే ఇద్దరు టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టారు జవాన్లు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఐదు రోజులుగా వాళ్ల కోసం అణువణువూ జల్లెడ పడుతున్నారు భారత సైనికులు. ఆర్మీ కంట పడకుండా ఓ పెద్ద కొండపైన ఉన్న గుహలో దాక్కున్నట్టు తెలుస్తోంది. అక్కడికి చేరుకోవడం ఆర్మీకి ఇబ్బందికరంగా మారింది. చుట్టూ అడవి, కొండలు వీటిని దాటుకుని అక్కడికి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ...ఇక్కడే మరో వాదన వినిపిస్తోంది. ఆ టెర్రరిస్ట్‌లకు ఆ పైకి ఎలా వెళ్లాలో తెలుసు. అది ఎంత కష్టమో కూడా తెలుసు. దట్టమైన ఆ అడవిలో అంతా చీకటిగానే ఉంది. ఆ చీకట్లో టెర్రరిస్ట్‌లను పట్టుకోవడం అంత సులువైన పనేమీ కాదు. అందుకే ఇన్ని రోజుల పాటు ఆపరేషన్ కొనసాగుతోంది. అక్కడికి చేరుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు విశ్వసీనయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 13న తెల్లవారుజామున ఉగ్రవాదులపై దాడి చేయాలని ఆర్మీ ప్లాన్ చేసుకుంది. కానీ...అది సాధ్యం కాలేదు. 


కొండను చుట్టుముట్టిన ఆర్మీ..


ఆ ఏరియా అంతా టెర్రరిస్ట్‌లకు బాగా తెలుసు. అందుకే అంత ధీమాగా ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. పైకి వెళ్లే మార్గం ఆ ఉగ్రవాదులకు తప్ప ఇంకెవరికీ తెలిసుండకపోవచ్చన్న వాదనలూ వినిపిస్తున్నాయి. సైనికులు ఎలాగోలా పైకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నా పై నుంచి దాక్కుని కాల్పులు జరుపుతున్నారు ముష్కరులు. ఇప్పటికైతే ఇండియన్ ఆర్మీ ఆ కొండను చుట్టుముట్టింది. ఇజ్రాయేల్ నుంచి తెప్పించిన డ్రోన్‌లతో నిఘా పెడుతోంది. పేలుడు పదార్థాలనూ సిద్ధంగా ఉంచుకుంది. లొకేషన్‌ కనిపించిన వెంటనే దాడి చేసేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకుంది. ఆ గుహలో టెర్రరిస్ట్‌లకు ఆయుధాలు, ఆహారం అంతా అందుబాటులోనే ఉందని, వాళ్లు ఎన్నిరోజులైనా దాక్కునేలా ముందుగానే స్కెచ్ వేసుకున్నట్టు సమాచారం.