దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కంజావాలా కేసులో బాధితురాలు అంజలీ ఇంట్లో చోరీ జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నిధి అంటున్నారు బాధితురాలి ఫ్యామిలీ. అంజలీ మృతి కేసు ఇప్పటి వరకు సంచలనంగా మారితే ఇప్పుడు  ఇంట్లో చోరీ మరో చర్చనీయాంశమైన విషయంగా మారింది.


ఢిల్లీలోని కరణ్ విహార్‌లో ఉండే అంజలి ఇంట్లో ఈ ఉదయం చోరీ జరిగింది. విషాయాన్ని తెలుసుకున్న అంజలి ఫ్యామిలీ అక్కడుకు చేరుకొంది. అక్కడకు వెళ్లేసరికి తలుపు తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు చిందర వందరగా డి ఉన్నాయి. ఇంట్లో ఉన్న టీవీ మరికొన్ని వస్తువులు చోరీకి గురైనట్టు అంజలీ సోదరి గుర్తించారు.


ఈ చోరీపై అంజలీ బంధువులు మీడియాతో మాట్లాడుతూ... ఈ చోరీ వెనుక అంజలీ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న నిధి హస్తం ఉందని ఆరోపించారు. నిన్నటి వరకు ఆ ఇంటి చుట్టూ పోలీసులు కాపలాగా ఉండే వాళ్లని ఈ చోరీ జరిగే నాటికి లేరని ఆరోపించారు. పోలీసులు ఆ టైంలో ఎక్కడకు వెళ్లారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


అంజలీ మృతి కేసులో ఇప్పటికే కార్‌లో ఉన్న నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. కార్‌ కింద యువతి చిక్కుకుందని తెలుసని ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కార్ ఆపి బాడీని తీయాలనుకున్నా... ఎవరైనా చూస్తే పట్టుకుంటారన్న భయంతో ముందుకు వెళ్లిపోయినట్టు వివరించారు. వేగంగా వెళ్లిపోతే బాడీ దానంతట అదే ఎక్కడైనా పడిపోతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు తెలిపారు. అలా కిలోమీటర్ల కొద్దీ లాక్కుంటూ తీసుకెళ్లారు. ఇప్పటి వరకూ ఈ ఘటనపై ఎన్నో అనుమానాలున్నాయి. చివరకు...నిందితులు నేరం అంగీకరించడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ నిందితుడు అంకుశ్ ఖన్నాకు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.20 వేల బాండ్‌తో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కార్‌ ఓనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


కంజావాలా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంజలి సింగ్ ఫ్రెండ్ నిధి గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ యువతి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు వెల్లడించారు. 2020 డిసెంబర్‌లో Narcotic Drugs and Psychotropic Substances Act కింద నిధిని ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉన్నట్టు ANI వార్తా సంస్థ తెలిపింది. తెలంగాణ నుంచి ఆగ్రాకు గంజాయి తీసుకొస్తుండగా ఆగ్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీ చేసి అరెస్ట్ చేశారు. అదే కేసులో సమీర్, రవి అనే యువకులనూ అరెస్ట్ చేశారు పోలీసులు. నిధి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2020 డిసెంబర్ 15న ఆమెకు బెయిల్ వచ్చినట్టు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అయితే... కంజావాలా కేసులో భాగంగా ఆమెను విచారిస్తున్న సమయంలో ఈ పాత కేసు బయటకు వచ్చింది. ఇప్పటికే ఈమెను అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు. విచారణకు మాత్రమే తనను పిలిచనట్టు స్పష్టం చేశారు. 


కంజావాలా కేసులో మరో రెండు సీసీటీవీ ఫుటేజ్‌లు కొత్త అనుమానాలకు తెర తీశాయి. అంజలి, నిధితో పాటు స్కూటీపై ఓ యువకుడు కూడా ఉన్న విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అంజలి, నిధితో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రెండు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా విచారిస్తున్నారు. వీటిలో మొదటి ఫుటేజ్‌ 7.7 నిముషాల నిడివి ఉంది. ఇది డిసెంబర్ 31 అర్ధరాత్రి వీడియో. అందులో స్కూటీపై అంజలి నిధి ఉన్నారు. ఓ యువకుడు స్కూటీ నడుపుతున్నాడు. మధ్యలో అంజలి కూర్చోగా...చివర నిధి కూర్చుంది.