ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో రెచ్చిపోతున్నారు. ప్రజలను బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. గోడలకు కన్నమేయాల్సిన అవసరం లేదు. తలుపులు బద్దలు కొట్టాల్సిన పనిలేదు. కాలు బయటపెట్టకుండానే కావాల్సినంత దోచుకుంటున్నారు. కాస్త కంప్యూటర్‌ పరిజ్ఞానంతోనే కోట్లు కొల్లగొడుతున్నారు. ఇంగ్లీష్, హిందీలో నాలుగు ముక్కలు మాట్లాడి బురిడీ కొట్టిస్తున్నారు. నగరం, గ్రామీణం తేడా లేకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు.


ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నా, రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి దాకా ప్రకటనలు, ఓటీపీలు, ఆఫర్ల పేరుతో యూజర్ల నుంచి నగదు తస్కరించిన సైబర్‌ నేరగాళ్లు, కొత్త తరహా మోసాలకు తెర తీశారు. టాస్క్‌-బేస్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్ల  మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ దోస్త్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. తాజాగా టాస్క్‌-బేస్డ్‌ మోసాల గురించి అవగాహన కల్పిస్తూ ఎక్స్‌లో 39 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పోస్ట్‌ చేసింది.


సోషల్‌ మీడియా ఖాతాలను ఫాలో అవ్వడం, యూట్యూబ్‌ వీడియోలకు లైక్‌లు, కామెంట్‌లు చేయడం, హోటళ్లు, రెస్టారెంట్‌లు, సినిమాలకు రివ్యూ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చని ఆశ చూపి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఎక్కువగా టెలిగ్రామ్ యాప్‌లో జరుగుతున్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. సైబర్‌ నేరాల నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే సైబర్‌ దోస్త్‌ సోషల్ మీడియాలో కీలక విషయాలు వెల్లడించింది. ఫోన్‌కు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో మెసేజ్‌లు వస్తే వాటి నమ్మొద్దని హెచ్చరించింది. ఫోన్లు వస్తే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో లేదా 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. 


2019 నుంచి ఈ ఏడాది జులై వరకు దేశంలో 36.29 లక్షల సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు నమోదయ్యాయి. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నివేదిక ప్రకారం 2019లో 3,94,499 కేసులు, 2020లో 11,58,208, 2021లో 14,02,809, 2022లో ఇప్పటివరకు 6,74,021 కేసులు నమోదయ్యాయి. సైబర్‌ ఉచ్చు నుంచి ప్రజలను రక్షించేందుకు ఆయా రంగాల్లోని సంస్థలతో తగిన హెచ్చరికలను ముందుగానే రూపొందించి, విశ్లేషణ అనంతరం ప్రభుత్వం ఆటోమేటెడ్ సైబర్ థ్రెట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహిస్తోంది. సైబర్ భద్రతా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు, సైబర్ దాడులను నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూనే ఉంది.


2021లో దేశవ్యాప్తంగా మొత్తం 52,430 సైబర్‌ నేరాలు వెలుగుచూస్తే, వాటిల్లో దాదాపు 20 శాతం తెలంగాణలోని నమోదయ్యాయి. 2022లో రాష్ట్రంలో నమోదైన 15,217 నేరాల్లో ఆర్థిక మోసాలకు సంబంధించినవే 12,272. ఒకప్పుడు మొత్తం నేరాల్లో దొంగతనాలు, భౌతిక దాడులకు సంబంధించిన కేసులు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు వాటిస్థానాన్ని సైబర్‌ నేరాలు ఆక్రమించాయి. 2019లో 2691గా ఉన్న సైబర్‌నేరాలు గతేడాది ఏకంగా 15217కు చేరాయి. అంటే దాదాపు అయిదున్నర రెట్లు పెరిగాయని చెప్పొచ్చు. సైబర్‌నేరాల విషయమై రాష్ట్రపోలీస్‌శాఖ వాదన మరోలా ఉంది. సైబర్‌ నేరాల నియంత్రణ విషయంలో రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటైన ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) తరహాలోనే తెలంగాణ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ని అందుబాటులోకి తెచ్చింది. సైబర్‌నేరం నమోదైన వెంటనే సత్వరం దర్యాప్తు ఆరంభించడం ద్వారా వీలైనంత మేరకు బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రప్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.