ఒక వ్యవస్థలో జరిగిన తప్పిదానికి అది ఏ స్థాయిలో జరిగిందో అక్కడి వ్యక్తులను సాధారణంగా బాధ్యులను చేస్తుంటారు. ఎందుకంటే టాప్‌లో ఉండే వ్యక్తులు కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేస్తారు.. కానీ అమలు చేయాల్సింది మాత్రం కింది స్థాయి వ్యక్తులు. అలా అమలు చేయాల్సిన వ్యక్తుల చేతిలో తప్పిదం జరిగితే వారినే బాధ్యులను చేయడం సబబు. కానీ, ఈ ఘటనలో మాత్రం ఏకంగా సీఈవోనే రాజీనామా చేశారు. 


తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో ఖాతా ఉన్న చెన్నైకి చెందిన క్యాబ్ డ్రైవర్ అకౌంట్‌లో ఏకంగా రూ.9 వేల కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ బ్యాంకు ఎండీ, సీఈవో క్రిష్ణన్ రాజీనామా చేసేశారు. రాజీనామా లెటర్‌లో మాత్రం ‘పర్సనల్ రీజన్స్’ అని పేర్కొన్నారు. క్రిష్ణన్ 2022 ఏడాది సెప్టెంబర్ నెలలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంకుకు సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.


తూత్తుకుడి కేంద్రంగా బ్యాంకు కార్యకలాపాలు సాగుతుండగా, గురువారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో క్రిష్ణన్ రాజీనామాను ఆమోదించారు. అలాగే ఆ లేఖను ఆర్బీఐకి పంపినట్లుగా బ్యాంకు వెల్లడించింది. ఆర్బీఐ నుంచి సమాధానం వచ్చే వరకూ ఎస్. క్రిష్ణన్ ఎండీ, సీఈవోగా కొనసాగుతారని.. ఇది నోటీస్ పిరియడ్ లాంటిదని ఎస్ క్రిష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. 


గత వారంలో ఓ రాజ్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి. ఆయన ఆ మెసేజ్ చూసుకోగానే అదొక స్కామ్ అని లైట్ తీసుకున్నాడు. అయినా తన స్నేహితుడికి రూ.21 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత కొంత సేపటికే బ్యాంకు అతని అకౌంట్ నుంచి మిగిలిన డబ్బుల్ని డెబిట్ చేసేసింది.