Tamilisai Soundararajan: చెన్నై: తన దగ్గర డబ్బులు లేకపోవడంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharamam) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai) సైతం దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన వద్ద డబ్బులు లేకనే పోటీచేసినా, ఎన్నికల్లో ఓడిపోయానని తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దక్షిణ చెన్నై నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఆమెకు టికెట్ ఇచ్చింది.


నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల్ని సమర్థించారా?
చెన్నై సౌత్ నియోజక వర్గంలో తమిళిసై లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం చేసిన తమిళిసై.. ఈసారైనా తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో తాను 5 సార్లు పోటీ చేసినా, డబ్బులు లేక ఖర్చు పెట్టలేదన్నారు. డబ్బులు లేకపోవడంతోనే తాను ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చానని తమిళిసై వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి ప్రధాని మోదీకి తన సీటు గిఫ్ట్ గా ఇస్తానన్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతున్న 400 సీట్లలో తన సీటు కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. డబ్బులు లేని కారణంగానే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు తమిళి సై సమర్థించారు. 


2019లో ఎగ్జిట్, 2024లో రీఎంట్రీ 
తమిళిసై 2014 నుంచి 2019 సెప్టెంబర్ వరకు తమిళినాడు బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్థించారు. ఆపై 2019 సెప్టెంబర్ నుంచి మార్చి 2024 వరకు తెలంగాణ గవర్నర్ (Telangana Governor) గా సేవలు అందించారు. అయితే మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు బీజేపీ ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. దాంతో తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళి సై ఇటీవల రాజీనామా చేశారు. ఇటీవల తిరిగి బీజేపీలో చేరిన తమిళిసైకి అభ్యర్థుల మూడో జాబితా (BJP MP Candidates 3rd List)లో అవకాశం లభించింది. తమిళిసై ఎన్నికలకు నామినేషన్ కోసం రెడీ చేసి అఫిడవిట్ లో ఆమె ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ అయ్యాయి. అంతలోనే తన వద్ద డబ్బులు లేకనే ఎన్నికల్లో ఓడిపోతున్నానని ప్రచారంలో భాగంగా తమిళిసై స్వయంగా చెప్పడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గెలిచేవారంతా డబ్బులు ఉన్నందునే ఎన్నికల్లో గెలుస్తున్నారా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


అఫిడవిట్‌లో తమిళిసై ఆస్తుల వివరాలు..
తమిళిసై అఫిడవిట్ లెక్కల ప్రకారం ఆమె మీద ఉన్న మొత్తం ఆస్తులు రూ. 2.17 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్‌లో రూ. 50 వేల నగదు ఉంది. తమిళిసైకి రూ.1.57 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. కానీ ఆమె పేరిట ఒక్క కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె కుమార్తె పేరు మీద 4 కార్లు ఉన్నాయి. తమిళిసై భర్త పేరిట రూ. 3.92 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. 


Also Read: BJP Candidates List: బీజేపీ మూడో జాబితా విడుదల, మరోసారి బరిలోకి తమిళిసై - పోటీ ఎక్కడినుంచంటే!