ప్రధాని మోదీకి వైట్ హౌస్‌లో పసందైన విందు ఇచ్చారు బైడెన్ దంపతులు. అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్‌లో లభించిన అదిరే ఆతిథ్యానికి ప్రధాని మోదీకి ఫిదా అయిపోయారు. పరస్పరం బహుమతులతో గౌరవించుకున్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు అనంతరం ప్రైవేట్ విందులో పాల్గొన్నారు. 


బైడెన్ దంపతులు భారత ప్రధానికి ఇచ్చిన విందులో మోదీకి ఇష్టమైన వంటలకాలకు అమెరికన్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. వైట్ హౌస్ చెఫ్ నైనా కర్టిస్ మోదీ విందు కోసం వివిధ రకాల డిషెస్ వండారు. మోదీ పూర్తి స్థాయి వెజెటేరియన్. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వంటల మెనూ తయారు చేసినట్లు నైనా కర్టిస్ తెలిపారు. మోదీకి ఇచ్చిన డిన్నర్ మెనూలో ప్రత్యేకమైంది మిల్లెట్స్. తృణధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న ప్రధాని మోదీకి గౌరవమివ్వాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్ మోదీ కోసం ప్రత్యేకంగా మేరినేటెడ్ మిల్లెట్స్‌ను డిన్నర్‌లో మోదీకి అందించారు. 


గ్రిల్డ్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మిలన్, టాంగీ అవకాడో సాస్, స్టఫ్డ్ పోర్టబెల్లో మష్రూమ్స్, సుమాక్‌ రోస్టెడ్‌ సీబాస్‌, మిల్లెట్స్ కేక్స్‌ను డిన్నర్‌లో మోదీకి వడ్డించారు. చివరగా స్ట్రాబెర్రీ కేక్‌తో వైట్‌ హౌస్‌లో డిన్నర్‌ విందును ముగించారు. మోదీకి ఇష్టమైన వంటకాలను తెలుసుని... వాటిలో భారతీయత ఉండేలా అమెరికన్ టచ్ ఇస్తూ ఈ వంటకాలను సిద్ధం చేసినట్లు నైనా కర్టిజ్ తెలిపారు.


అంతకు ముందు ఆయనకు వైట్‌ హౌస్‌లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. న్యూయార్క్ పర్యటన ముగించుకుని వాష్టింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి జోరు వానలోనే అమెరికా అధికారులు, భారత రాయబారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వైట్ హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సాదర స్వాగతం పలికారు. మోదీని ఆత్మీయంగా పలకరిస్తూ వైట్ హౌస్‌లోకి తీసుకెళ్లారు. 


అలా అమెరికా అధ్యక్షుడి ఆహ్వానంతో వైట్ హౌస్‌లోకి  వెళ్లిన మోదీ ప్రెసిడెంట్‌ దంపతులను సర్‌ప్రైజ్‌  చేస్తూ బహుమతులు అందజేశారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాల సంస్కృతి మేళవింపుతో తయారు చేసిన బహుమతులను గంధపుచెక్క పెట్టెలో పెట్టి ఇచ్చారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన గంధపు చెక్కను రాజస్థాన్‌లో మాస్టర్ క్రాఫ్ట్ మన్ అందంగా నగిషీలు చెక్కారు. ఆ గంధపు చెక్క పెట్టెలో కోల్‌కతా కళాకారులు తయారు చేసిన వినాయకుడి విగ్రహం, వెండితో తయారు చేసిన దీపపు కుందె ఉంచారు. దీన్ని కూడా బెంగాల్‌లో తయారు చేయించారు. 


వెయ్యి పౌర్ణమిలు చూసిన దంపతులకు చేసే దాన కార్యక్రమాన్ని బైడెన్ దంపతులకు మోదీ చేశారు. గోదానంగా వెండి కొబ్బరికాయ, భూదానంగా గంధపుచెక్క, తిలాదానంగా తెల్లనువ్వులు, హిరణ్యదానంగా బంగారుకాసు, అజ్యదానంగా నెయ్యి, ధాన్యదానంగా బియ్యపు గింజలు, వస్త్రదానంగా బట్టలను, బెల్లాన్ని, వెండి నాణేన్ని, ఉప్పును పెట్టెలో ఉంచారు. నువ్వులను తమిళనాడు నుంచి, బంగారు కాసును రాజస్థాన్ నుంచి, ఉప్పను గుజరాత్ నుంచి తెప్పించారు. వీటితో పాటు టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉపనిషత్ పుస్తకాన్ని బహుకరించారు. 


అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్ కు ఖరీదైన పచ్చ వజ్రాన్ని గిఫ్ట్ ఇచ్చారు. ఇండియాకు స్వతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా 7.5 క్యారెట్ల అరుదైన వజ్రాన్ని గిఫ్ట్ ఇచ్చారు. ఈ వజ్రం మెరవాలంటే ముందు వజ్రం ఉంచాలంట. అంతటి కెమికల్, ఆప్టికల్ ప్రొపర్టీస్ ఉన్నాయి ఈ డైమండ్ లో. పైగా ఎకో ఫ్రెండ్లీ కూడా. దీని తయారీలో సౌరశక్తి, వాయుశక్తిని వినియోగించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తో క్యారెట్ కు 0.028 గ్రాముల కార్బన్ మాత్రమే వాడుతూ తయారు చేసిన ఈ వజ్రాన్ని జెమెలాజికల్ ల్యాబ్ సర్టిఫై చేసింది. 


ప్రతిగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష దంపతులు రిటర్న్ గిఫ్టులు ఇచ్చారు. ఇరవై శతాబ్దం తొలినాళ్లకు చెందిన చేతితో తయారు చేసిన అమెరికన్ బుక్ గ్యాలెను, రాబర్ట్ ఫ్రాస్ట్ కలెక్టెడ్ పొయెమ్స్ ఫస్ట్ ఎడిషన్ బుక్‌ను జిల్‌ బైడెన్‌ బహుమతిగా ఇచ్చారు. ప్రెసిడెంట్ జో బైడెన్ వింటేజ్ ఫస్ట్ కొడాక్ కెమెరాను మోదీకి గిఫ్ట్ ఇచ్చారు. అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ బుక్ ను మోదీకి జో బైడెన్ ప్రజెంట్ చేశారు.