Kerala Governor: 


కాన్వాయ్‌లో భద్రతాలోపం 


కేరళ గవర్నర్ ఆరిఫ్‌ మహమ్మద్ ఖాన్‌ తృటిలో ప్రమాదం తప్పింది. నోయిడాలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఢిల్లీకి వెళ్తుండగా కాన్వాయ్‌లోకి ఓ కార్ వేగంగా దూసుకొచ్చాయి. అది కూడా ఒక్కసారి కాదు. రెండు సార్లు. ఈ ఘటనతో ఒక్కసారిగా అధికారులు టెన్షన్ పడ్డారు. బ్లాక్ స్కార్పియోలో కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ కార్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ వెంటనే అప్రమత్తం అవడం వల్ల ప్రమాదం తప్పింది. అసలు అంత భద్రతను దాటుకుని ఎలా వచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. గవర్నర్ ఆరిఫ్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. యూపీ పోలీసులు మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరైనా కావాలనే దాడి చేశారా..? అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. 


ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఆయుధాలు ఉండటం అలజడి రేపింది. నిందితుడిని షేక్ నూర్ అలమ్‌గా గుర్తించారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. రకరకాల ఏజెన్సీలకు చెందిన ID కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాసేపటి వరకూ అక్కడ గందరగోళం నెలకొంది. నిందితుడి వద్ద ఉన్న తుపాకులు, కత్తులను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కోల్‌కత్తా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. 


"షేక్ నూర్ అలమ్ అనే ఓ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. కోల్‌కత్తా పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తుపాకీ, కత్తులతో పాటు పలు ఏజెన్సీల పేరుతో ఉన్న ID కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టికర్‌ ఉన్న కార్‌లో వచ్చి ఇలా అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌కి విచారణ కోసం తీసుకెళ్లారు. పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడ విచారణ జరుపుతున్నారు"


- వినీత్ గోయల్,కోల్‌కత్తా పోలీస్ కమిషనర్


నితీష్‌కి కూడా..


బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. తన నివాసానికి దగ్గర్లోనే మార్నింగ్ వాక్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ బైక్‌ ఆయనవైపు దూసుకొచ్చింది. అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ...సీఎం వెళ్తున్న మార్గంలోకి ఆ బైక్‌ ఎలా వచ్చిందన్నదే అంతు తేలకుండా ఉంది. బైక్‌ దూసుకొచ్చిన సమయంలో నితీష్ కుమార్‌ వెంటనే అలెర్ట్ అయ్యారు. పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూకారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు ఆ బైక్‌పై వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం భద్రతకు సంబంధించిన విషయం అవడం వల్ల ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. ఇప్పటికే హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఎలా అని అధికారులు గట్టిగానే వాదించినట్టు సమాచారం.


Also Read: PSLV-C56: ఇస్రో మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ షురూ- రేపు నింగిలోకి PSLV-C56