Sharad Vs Ajit: ఎన్సీపీ గడియారం గుర్తును ఎన్నికల సంఘం ఎవరికి కేటాయించినా ఆ నిర్ణయాన్ని తాను పూర్తిగా అంగీకరిస్తానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ తెలిపారు. అక్టోబర్ 6వ తేదీన ఎన్నికల సంఘం ముందు ఇరు వర్గాలు తమతమ వాదనలు వినిపిస్తాయని చెప్పారు. తమ అభిప్రాయన్ని, ఆధారాలను ఈసీ ముందు ఉంచుతామని ఆయన అన్నారు. ఎన్సీపీలో చీలిక రాలేదన్న శరద్ పవార్ నేతృత్వంలోని కూటమి వాదనలను ఎన్నికల సంఘం అంగీకరించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన ఇరు పక్షాలనను విచారణ రమ్మని ఆదేశించింది.


'ఎన్సీపీ గడియారం గుర్తును ఎవరికి కేటాయించాలో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుంది. అక్టోబర్ 6న ఎన్నికల సంఘం ముందు ఇరు వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత ఈసీ వెలువరించే తుది నిర్ణయాన్ని నేను అంగీకరిస్తాను' అని అజిత్ పవార్ పేర్కొన్నారు.


శివసేన(ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ కూటమిలో అజిత్ పవార్ చేరడంతో.. మహారాష్ట్ర రాజకీయాలు మరింత నాటకీయంగా మారాయి. అజిత్ పవార్ నిర్ణయం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్సీపీ పార్టీలోని కీలక నేతలను తన వెంట తీసుకెళ్లి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు అజిత్ పవార్. రాష్ట్ర మంత్రివర్గంలో పలువురికి స్థానం కల్పించగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయిపోయారు. పార్టీలో ఎలాంటి చీలక లేదని, శరద్ పవార్ అధ్యక్షుడిగా కొనసాగుతారని అజిత్ పవార్ తెలిపారు. అయితే, ఆ తర్వాత ఎన్సీపీ గడియారం గుర్తును తమకే కేటాయించాలంటూ అఫిడవిట్ లు దాఖలు చేశారు.


గతంలో ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన నాయకుడే అని అన్నారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదని పవార్ ప్రకటించారు. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ కూటమికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతు ఇవ్వాలనే షరతుపై ప్రధాని నరేంద్ర మోదీ అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారని కాంగ్రెస్ వాదించగా.. వాటిపై స్పందించిన శరద్ పవార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.


2 దశాబ్దాలకు పైగా శరద్ పవార్ నాయకత్వం.. 


ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్. పార్టీని స్థాపించిన ఆయన రెండు దశాబ్దాలకు పైగా విజయవంతంగా ఎన్సీపీని నడిపించారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి నేతలకు మార్గనిర్దేశం చేశారు. కానీ నేడు అనూహ్యంగా అజిత్ పవార్ వర్గం తమ రాజకీయ కుటిల నీతిని చూపించింది. శరద్ పవార్ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదని, ఆయనకు ఎమ్మెల్యేలు, నేతల మద్దతు లేదంటూనే అజిత్ పవార్ ను ఎన్సీపీ నేషనల్ చీఫ్ గా పరిగణించాలని తిరుగుబాటు నేతలు ఈసీని కోరారు.


మహారాష్ట్రలో పవార్ వర్సెస్ పవార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ శిందే ప్రభుత్వంతో చేతులు కలిపారు. అక్కడితో ఆగకుండా తమదే అసలైన NCP అని, ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని అజిత్ పవార్ వర్గం ప్రకటించుకుంది. అక్కడి నుంచి రాజకీయాలు మారిపోయాయి. 53 మంది NCP ఎమ్మెల్యేలలో 40 మంది మద్దతు తమకే ఉందని అజిత్ పవార్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్  ప్రమాణ స్వీకారం చేసిన తరవాత సీన్ మారిపోయింది. గవర్నర్‌కి ఇచ్చిన లేఖలో మాత్రం తనకు 40 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. సంతకాలు కూడా పెట్టించారు. కానీ...తమకు విషయం ఏంటో చెప్పకుండా  హడావుడిగా సంతకాలు పెట్టించుకున్నారని కొందరు ఎమ్మెల్యేలు మండి పడుతున్నట్టు సమాచారం. అయితే ఇందులో 5 మంది ఎమ్మెల్యేల వరకు తిరిగి శరద్ పవార్ చెంతకు చేరినట్లు తెలుస్తోంది.