జులై 21వ తేదీన హియరింగ్


జ్ఞానవాపి మసీదులో వెలుగులోకి వచ్చిన శివలింగానికి పూజలకు అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈ నెల 21వ తేదీన హియరింగ్‌కు అనుమతినిచ్చింది. అదే సమయంలో శివలింగం ఎన్నేళ్ల క్రితందో కూడా తేల్చి చెప్పాలని ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా స్పష్టమైన సమాచారం ఇవ్వాలని చెప్పింది. జస్టిస్ ఎన్‌వీ రమణ,జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. దీంతో పాటు అంజుమాన్ ఇంతెజామియా మసీద్ కమిటీ వేసిన పిటిషన్‌ను కూడా విచారించనుంది. మసీదు లోపల సర్వే చేపట్టటాన్ని వ్యతిరేకిస్తూ ఈ కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ హియరింగ్ జరగనుంది. శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు వారణాసి జిల్లా కోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. నమాజ్ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. 


శివలింగానికి పూజలకు అనుమతి కోసం పిటిషన్ 


జ్ఞానవాపి మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగానికి హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ఈ మసీదులో కొన్ని నెలల క్రితం శివలింగం బయట పడింది. చాన్నాళ్ల పాటు ఈ అంశంపై వాదనలు జరిగాయి. అయితే శ్రీకృష్ణ జన్మభూమి ముక్తిస్థల్ అధ్యక్షుడు రాజేశ్ మని త్రిపతి, సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. శ్రావణ మాసం ప్రారంభమైనందున మసీదులోని శివలింగానికి హిందువులు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఇది హిందువుల హక్కు అని అందులో ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రావణ మాసంలో శివుడికి పూజలు చేయటం హిందూ ఆచారమని, వారి హక్కులని, 
మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజలకు అనుమతినివ్వాలని కోరారు. 


ఏప్రిల్‌లో హిందూ మహిళల పిటిషన్


ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన వారణాసి కోర్టు ఓ కీలక తీర్పునిచ్చింది. మసీదులోని శివలింగానికి  పూజలకు అనుమతించాలని ఓ ఐదుగురు హిందూ మహిళలు కోర్ట్‌లో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్ట్...ఈ అంశంపై సర్వే చేయటమే కాకుండా లోపల వీడియో తీసి సాక్ష్యాధారాలు బయట పెట్టాలని ఆదేశించింది. మే 16వ తేదీన ఈ సర్వే పూర్తైంది. మే 19న కోర్ట్‌లో ఈ సర్వేను ప్రవేశపెట్టారు. వీడియోగ్రఫీ సర్వేలో మసీదులో శివలింగం బయపడిందని హిందువులు వాదించారు. కానీ ముస్లింలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. వాజుఖానాలో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటేన్‌కు సంబంధించిన శకలం అని వివరించారు. మే 20 వ తేదీన సుప్రీం కోర్టు ఈ కేసుని వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.