Rajya Sabha Elections 2022: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను సమాజ్‌వాదీ పార్టీ ఖరారు చేసింది. అయితే ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్ రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచారు. కపిల్‌తో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు జావేద్ అలీ ఖాన్ కూడా ఎస్పీ తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు. 





మరొక సీటు కోసం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నట్లు సమాచారం. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో కపిల్ సిబల్ తన నామపత్రం దాఖలు చేశారు. 






ఎన్నికలు


రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇటీవల షెడ్యూలు విడుదల చేసింది. జూన్‌ 10న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. 15 రాష్ట్రాలకు సంబంధించిన 57 మంది ఎంపీల పదవీకాలాలు జూన్‌ 21 నుంచి ఆగస్టు ఒకటి లోపు పూర్తి కానున్నాయి.


ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలున్నాయి. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 11 స్థానాలు, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి 6 స్థానాల చొప్పున ఖాళీ అవుతున్నాయి. పదవీకాలం పూర్తవుతున్న వారిలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చిదంబరం, జైరాం రమేష్‌, కపిల్‌ సిబల్‌, అంబికా సోని తదితరులున్నారు.


తెలంగాణ నుంచి తెరాస ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, భాజపా ఎంపీలు వై.సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్‌, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21వ తేదీతో పూర్తవుతుంది. 


Also Read: Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!


Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?