Rajasthan ED Raids: 


గహ్లోట్ వివాదాస్పద వ్యాఖ్యలు..


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ సంచలన కామెంట్స్ చేశారు. ఈడీ సోదాలు నిర్వహించడంపై మండి పడిన ఆయన...ఈడీ అధికారులు వీధి కుక్కల్లా తిరుగుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా రాజస్థాన్‌లోని కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్ గహ్లోట్‌కీ ఓ కేసులో సమన్లు జారీ అయ్యాయి. అప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. నవంబర్ 25న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఇలా ఈడీ సోదాలు జరుగుతుండడం అలజడి సృష్టిస్తోంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపే అని కాంగ్రెస్ మండి పడుతోంది. బీజేపీకి ఇదో రాజకీయ అస్త్రంగా మారిపోయిందని అశోక్ గహ్లోట్‌ ఫైర్ అయ్యారు. ఈడీ అధికారులను వీధి కుక్కలతో పోల్చుతూ తీవ్రంగా స్పందించారు. 


"ఈడీ అధికారులు వీధి కుక్కల కన్నా దారుణంగా మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ దేశంలో వీధి కుక్కల కన్నా ఈడీ అధికారులే ఎక్కువగా తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మా గ్యారెంటీ మోడల్‌నే ఫాలో అవుతున్నారు. ఈడీ, సీబీఐ అధికారులతో నేను మాట్లాడాను. కాస్త సమయం కావాలని అడిగాను. కానీ ఈ దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీకి రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. మోదీకి అర్థం కాని విషయం ఏంటంటే ఆయనకు కౌంట్‌డౌన్ మొదలైంది. అందుకే మా గ్యారెంటీ మోడల్‌ని ఫాలో అవుతున్నారు"


- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి 


వైభవ్ గహ్లోట్‌కి ఈడీ సమన్లు..


రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్‌ కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఎగ్జామ్ పేపర్ లీక్‌ కేసులో భాగంగా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సరా (Govind Singh Dotasra) ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఈ కేసు అలజడి సృష్టించగా...ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. Foreign Exchange Management Act (FEMA) నిబంధనల్ని ఉల్లంఘించినందుకు అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్‌కి సమన్లు ఇచ్చింది. నవంబర్ 25న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు కేసులూ రాజకీయాల్ని వేడెక్కించాయి. వైభవ్ గహ్లోట్ (Vaibhav Gehlot) ప్రస్తుతం AICC సభ్యుడిగానే కాకుండా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్టోబర్ 27న జైపూర్‌లో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ మహిళలకు ఓ హామీ ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏటా మహిళలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన రెండో రోజే వైభవ్ గహ్లోట్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. అంతకు ముందు రోజు రాజస్థాన్‌ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొత్సరా ఇంట్లో సోదాలు చేశారు. ఎగ్జామ్‌ పేపర్ లీక్‌ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. 


Also Read: చంద్రయాన్ 3 పై ఇస్రో కీలక అప్‌డేట్, ల్యాండర్ దిగిన చోట 2 టన్నుల మట్టి చెల్లాచెదురు