భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ పాదయాత్ర
సెప్టెంబర్ 7 నుంచి పాదయాత్ర చేస్తున్న రాహుల్
150రోజుల్లో 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటన
రోజుకు 25-30 కిలోమీటర్ల మేర నడుస్తున్న రాహుల్
ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఫుడ్ కమిటీ
చేపలు, కూరగాయలతో ఆరోగ్యకరమైన వంటలు


150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటించేలా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్.. రోజుకు 25-30 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7 న పాదయాత్రను తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టగా సరిగ్గా 150 రోజుల తర్వాత జమ్ము కశ్మీర్ లో యాత్రను ముగించాలన్నది ప్లాన్. మొత్తం 3570 కిలోమీటర్లు రాహుల్ గాంధీ కాలినడకను తిరగనున్నారు.
రాహుల్ గాంధీ సుదీర్ఘమైన పాదయాత్ర
రాహుల్ గాంధీ ప్రస్తుతం పర్యటిస్తున్న కేరళలో సామాన్యులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ సైడ్ దుకాణాల దగ్గర ఆగుతూ వారిస్తున్నటీ, కాఫీ, బిస్కెట్ లను తింటూ వాళ్ల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ ఇంత సుదీర్ఘమైన పాదయాత్రను చేసింది లేదు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని తేల్చే యాత్రగా భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. రోజుకు సగటున 25-30 కిలోటమీర్ల పాటు అలుపు లేకుండా నడించేందుకు భారత్ జోడో యాత్ర ఫుడ్ కమిటీ రాహుల్ డైట్ ను ప్లాన్ చేసింది. 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు అక్కడ దొరికే ఆరోగ్యకరమైన భోజనాన్ని రాహుల్ డైట్ మెనూలో భాగమయ్యేలా ప్లాన్ చేసింది.
ప్రొటీన్స్ కోసం డైట్ షెడ్యూల్ ప్లాన్
ఉదయం టీ, బిస్కెట్లతో రాహుల్ గాంధీ తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు ఆ తర్వాత గంట సేపు నడుస్తున్నారు. రోజులో పాదయాత్ర మొదలైన మూడు గంటల తర్వాత రాహుల్ తన టిఫిన్ తీసుకుంటున్నారు. టిఫిలో భాగంగా ప్రస్తుతం ఇడ్లీ, ఉప్మా, మసాల దోశ, వడలను ఆయన డైలీ రొటీన్ చేర్చింది ఫుడ్ కమిటీ. ఇక ప్రొటీన్స్ కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ లో డైట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మధ్యాహ్న భోజనంలో సీ ఫుడ్ తప్పనిసరి చేశారు. చేపలతో పాటు ఏదైనా ఓ కూరగాయను కచ్చితంగా మెనూలో ఉండేలా చూస్తున్నారు.


సాయంత్రం పూట రాహుల్ తేలికపాటి ఆహారాన్ని, పండ్లను తీసుకుంటున్నారు. రాత్రివేళ మితాహారాన్ని స్వీకరిస్తున్నారు. చపాతి, అందులో పన్నీర్ కూరకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యాత్ర ఫుడ్ కమిటీ చెబుతోంది. మధ్యాహ్నం వేళ డీ హైడ్రేట్ కాకుండా తరచూ జ్యూస్ అందిస్తున్నట్లు చెబుతున్నారు. మార్గమధ్యంలో చాలా మంది రాహుల్ కు కొబ్బరిబొండాలను ఆఫర్ చేస్తున్నారు. నూనె ఎక్కువగా ఉండే వంటలు, అలసటకు గురి చేసే ఆహారాన్నేదీ రాహుల్ గాంధీ ఇవ్వటం లేదు. 


తమిళనాడులో ఆరంభమైన ఈ యాత్ర కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మీదుగా జమ్మూకశ్మీర్‌కు చేరుకుంటుంది. శ్రీనగర్‌లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభతో 150 రోజుల తర్వాత తన యాత్రను ముగిస్తారు రాహుల్ గాంధీ. అత్యధికంగా కర్ణాటక, రాజస్థాన్‌ల్లో 21 రోజుల పాటు ఆయన యాత్ర కొనసాగుతుంది.