Punjab News : పంజాబ్‌ లూథియానాలో 6 రూపాయల టిక్కెట్‌తో ఓ కానిస్టేబుల్ కోటీశ్వరుడు అయిపోయాడు. కుల్దీప్ సింగ్ ఫిరోజ్‌పూర్ క్యూఆర్‌టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుల్దీప్ సింగ్ తన ఉద్యోగ నిమిత్తం తరచూ లూథియానాకు వెళ్లేవారు. అలా వెళ్లినప్పుడల్లా అక్కడి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండే ఓ ఏజెంట్ నుంచి నాగాలాండ్ లాటరీ సంస్థకు చెందిన లాటరీ టికెట్ కొనేవాడు. ఇలాకొన్న ఓ లాటరీ టికెట్ కోటి రూపాయలు తగిలాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన కుల్‌దీప్ సింగ్ తన కుమారుడ్ని చదువుకు లాటరీ డబ్బును ఉపయోగిస్తానని ప్రకటించాడు.


తల్లి మాట మేరకు 


ఇంకా పేద పిల్లలకు సహాయం చేస్తానని, కొంత డబ్బును గురుద్వారాలకు అందజేస్తానని కుల్దీప్ సింగ్ తెలిపారు. తనకు లాటరీ టికెట్ కొనే అలవాటు లేదని కుల్దీప్ అన్నారు. తల్లి సలహా మేరకే తాను ఆరు నెలల క్రితం లాటరీ టికెట్ కొన్నానని కుల్దీప్ సింగ్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ, "నా తల్లి బల్జిందర్ కౌర్ నన్ను ఆరు నెలల క్రితం లాటరీ టికెట్ కొనమని అడిగారు. అప్పటి నుంచి నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. నేను లూథియానాకు వచ్చినప్పుడల్లా నాగాలాండ్ రాష్ట్ర లాటరీ టికెట్లను కొనుగోలు చేసేవాడిని. నేను ఎప్పుడూ ఇది ఊహించలేదు. ఇంత భారీ మొత్తంలో గెలుస్తానని అనుకోలేదు. నాలుగు నెలల క్రితం నేను రూ.6,000 గెలుచుకున్నాను. ఇప్పుడు కోటి రూపాయలు గెలుచుకున్నాను." అన్నారు. 


స్వచ్ఛంద సేవలకు వినియోగిస్తా


మంగళవారం రాత్రి డ్యూటీలో ఉండగా లాటరీ ఫలితాలు వచ్చాయని కుల్దీప్ సింగ్ చెప్పారు. "నాగాలాండ్ రాష్ట్ర లాటరీలో నేను మొదటి బహుమతిని గెలుచుకున్నానని వెండర్, గాంధీ ట్రేడర్స్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ మొత్తాన్ని అందుకోవడానికి ఫార్మాలిటీలు పూర్తి చేసేందుకు లూథియానాకు వచ్చాను” అని ఆయన చెప్పారు. లూథియానా రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ వ్యాపారి నుంచి 25 లాటరీ టిక్కెట్ల కోసం రూ.150 ఖర్చు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు. నాగాలాండ్ లాటరీ టికెట్ ధర ఆరు రూపాయలు మాత్రమే అని చెప్పారు. తాను నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతానని, ఇంత పెద్ద మొత్తాన్ని పొందడం వల్ల తన జీవితం ఏంమారిపోదని కుల్దీప్ అన్నారు. తాను లాటరీలను కొనుగోలు చేస్తూనే ఉంటానని, అందులో గెలుపొందిన వాటిని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు, ముఖ్యంగా వెనుకబడిన యువకుల విద్యకు వినియోగిస్తానని ప్రకటించారు.