చంద్రయాన్-3 విజయం ఊపు ఇంకా తగ్గలేదు. ఏదో చోట ఆ బజ్‌ కనిపిస్తోనే ఉంది. ఇంతటి గొప్ప విజయం సాధించిన టైంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడి నుంచే ఈ విజయాన్ని ఆస్వాధించారు. వర్చువల్‌గా ఇస్రో సంబరాల్లో పాల్గొన్నారు.


ప్రపంచమే ఆశ్చర్యపోయే విజయాన్ని సొంత చేసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలను నేరుగా అభినందించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌ పర్యటన తర్వాత తన షెడ్యూల్‌ను పూర్తి గా మార్చేశారు. నేరుగా ఢిల్లీ రాకుండా బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. 






గ్రీస్ పర్యటన ముగించుకొని బెంగళూరు వచ్చిన ప్రధానమంత్రి మోదీకి ఘనస్వాగతం లభించింది. అక్కడ ఎయిర్‌పోర్టుల దిగిన వెంటనే స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జై విజ్ఞాన్‌... జై అనుసంధాన్‌ అంటూ స్లోగన్స్‌ ఇచ్చారు.  ఇది శాస్త్రవేత్తలకు మరింత బూస్టు అవుతుందన్నారు. 






బెంగళూరు వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి  రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎంగానీ, డిప్యూటీ సీఎంగానీ ఎవరూ రాలేదు. దీనిపై మోదీ మాట్లాడుతూ... శాస్త్రవేత్తలతో సమావేశమై వెళ్లిపోతాను కాబట్టి నేనే ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు రావద్దని చెప్పాను. 






ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ వర్గాలను అడిగితే... ప్రధాని వస్తున్నట్టు తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పుకొచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇస్రో చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. 


బెంగళూరులో ల్యాండ్ అవుతున్న టైంలో ఓ ట్వీట్ చేశారు ప్రధాని. చంద్రయాన్ -3 విజయంతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన శాస్త్రవేత్తలను కలుస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్పేస్ సెక్టార్లో మరిన్ని అద్భుతాలు సాధించి దేశాన్ని నడిపించడానికి  శాస్త్రవేత్తల డెడికేషన్ డ్రైవింగ్ ఫోర్సుగా ఉంటుందన్నారు.