వికసిత్ భారత్ కోసం వికసిత్ రైల్ ఇన్ ఫ్రా.. అనే నినాదంతో భారతీయ రైల్వే పలు కొత్త రైళ్లను ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ నుంచి ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. వాస్తవానికి అహ్మదాబాద్ - భుజ్ మధ్య తిరిగే నమో భారత్ ర్యాపిడ్ రైల్ ను ఆయన ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మిగతా ఆరు వందే భారత్ రైళ్లను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు వందే భారత్ రైళ్లు ఉండటం విశేషం. 


గాంధీ ధామ్ - ఆదిపూర్.. క్వాడ్రప్లింగ్ ప్రాజెక్ట్, సమాఖియలి - గాంధీ ధామ్ క్వాడ్రప్లింగ్ ప్రాజెక్ట్ లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం నమో భారత్ ర్యాపిడ్ రైల్ ని ప్రారంభించారు. వందే భారత్ మెట్రో రైల్ గా ఉన్న దీన్ని ఇకపై నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా పిలుస్తారు. దేశంలోనే ఇది తొలి వందే భారత్ మెట్రో సర్వీస్. అంటే మెట్రో నగరాల మధ్య తిరిగే వందే భారత్. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది మిగతా వందేభారత్ ట్రైన్స్ లా కాదు. ఇది పూర్తిగా అన్ రిజర్వ్డ్ ట్రైన్. అయితే అన్నీ ఏసీ బోగీలే ఉంటాయి. ఇందులో 1150 మంది కూర్చుని ప్రయాణించే వీలు ఉంటుంది. 2058 మంది వరకు నిలబడి ఎలాంటి రద్దీ లేకుండా ప్రయాణించవచ్చు. పశ్చిమ రైల్వే పరిధిలో ఈ నమో భారత్ ర్యాపిడ్ రైల్ ని మోదీ ప్రారంభించారు. అహ్మదాబాద్ - భుజ్‌ మధ్య ఈ రైలు సర్వీస్ ఉంటుంది. మధ్యలో 9 స్టాపులుంటాయి. అహ్మదాబాద్ - భుజ్ మధ్య 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు. ప్రతి రోజు ఉదయం భుజ్‌లో 5.05 గంటలకు నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌  కు ఉదయం 10.50 గంటలకు చేరుకుంటుంది. సాదారణ రైళ్లకు టికెట్లు తీసుకున్నట్టే రైలు బయలుదేరడానికి ముందు ప్రయాణికులు టికెట్‌ కొనుక్కుని ఈ రేలు ఎక్కొచ్చు. ఇందులో మినిమమ్ టికెట్‌ ధర రూ.30గా నిర్ణయించారు. 


ఇక ఈ రైలుతోపాటు.. ఆరు వందే భారత్ రైళ్లను కూడా ఈరోజు మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. 
నాగ్ పూర్ - సికింద్రాబాద్
దుర్గ్ - విశాఖపట్నం
కొల్హాపూర్ - పుణె
ఆగ్రా -బెనారస్
పుణె -హుబ్లి
మధ్య నడిచే వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. వీటితోపాటు వారణాసి -ఢిల్లీ మధ్య తిరిగే వందే భారత్ కొత్త సిరీస్ ని కూడా మోదీ ప్రారంభించడం విశేషం. ఈ కొత్త సిరీస్ ట్రైన్ లో 20 కోచ్ లు ఉంటాయి. ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్స్ లో 8 లేదా 16 కోచ్ లు మాత్రమే ఉండేవి. కొత్తగా తీసుకొచ్చిన వందే భారత్ లో 20 కోచ్ లు ఉంటాయి. దీన్ని ప్రస్తుతం వారణాసి - ఢిల్లీకి మాత్రమే పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని 20 కోచ్ ల ట్రైన్లు అందుబాటులోకి తెస్తారని అంచనా. 


Also Read: వంద రోజుల పాలన అద్భుతం- ప్రతి సెక్టార్‌లో ప్రగతి: మోదీ