PM Modi in Rameswaram: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆలయాల బాటపట్టారు. కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ సందర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం (Veera Bhadra Temple), మహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్‌ కాలారామ్‌ దేవాలయం (Kalaram Temple), కేరళ గురువాయుర్‌ (Guruvayur) ఆలయం, త్రిప్రయార్‌ రామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రామేశ్వరంలో రామనాథస్వామిని దర్శించుకున్నారు. 


అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం


ప్రధాని మోదీ అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం ఆచరించారు. సంప్రదాయ దుస్తులు, రుద్రాక్ష ధరించి పుణ్యస్నానం చేశారు. ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.  ఆలయ అర్చకులు మోదీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలోని ఏనుగు వద్దకు వెళ్లి...ప్రేమతో తొండాన్ని నిమిరారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు.


మరోవైపు అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవాని సంబంధించిన క్రతువులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను అయోధ్య ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్నిరంగాల ప్రముఖులు హాజరుకానున్నారు.  22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ దివ్యమైన.. మంగళమైన ముహూర్తం అని భక్తులు భావిస్తున్నారు. 12వేల మంది పోలీసులు, 10 వేల సీసీ కెమెరాలతో అయోధ్యలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రదాన మంత్రి భద్రతా సిబ్బంది...అయోధ్య రామాలయం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది.