PM Modi Delivers Speech At Jaipur Dgp IGP Meeting: ప్రధానమంత్రి మోడీ (Narendra Modi ) డీజీపీ (DGP), ఐజీపీ (IGP)ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల భద్రత కోసమే కొత్త చట్టాలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జైపూర్‌లో నిర్వహించిన డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మాట్లాడారు. పౌరులు, గౌరవం, న్యాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళలు, బాలికల హక్కులు, రక్షణపై అవగాహన కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. భారత నేర న్యాయవ్యవస్థలో మార్పులకు కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలే నిదర్శనమని ప్రధాని అన్నారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధార చట్టాల స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చింది.


పోలీసులు డేటాతోనే పని చేయాలి


పోలీసులు తమను తాము అత్యాధునిక, ప్రపంచ స్థాయి శక్తిగా మలచుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. పోలీసులు లాఠీకి బదులుగా డేటాతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు నిర్భయంగా ఎప్పుడైనా, ఎక్కడైనా పని చేసేలా పోలీసులు భద్రత కల్పించాలని సూచించారు. అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోల ఆపరేషన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఎదగాలనే...అదే ఆశయంతో పని చేస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. 


క్రిమినల్‌ చట్టాలను మార్చే మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. క్రిమినల్‌ చట్టాలను మార్చే మూడు బిల్లులను కేంద్ర  హోంమంత్రి అమిత్‌షా ఉపసంహరించుకున్నారు. భారతీయ న్యాయ సంహిత-2023, ది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023లను అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సిఫారసులను పొందుపరిచేందుకు, అనేక సవరణలను తీసుకువచ్చేందుకు బదులుగా...మార్పులను చేస్తూ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కొత్త బిల్లుల్లో... పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలను పొందుపరిచారు. కొత్త చట్టాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. 


డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచడానికి కొత్త CrPC బిల్లులోని నిబంధనలను కూడా ప్యానెల్ సిఫార్సు చేసింది. అరెస్టు చేసిన 15 రోజులకు మించి పోలీసు కస్టడీని అనుమతించే నిబంధనపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ విధివిధానాలను రాష్ట్రాలకే వదిలేయాలని కూడా సూచించింది. గత నెలలో, హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వివిధ మార్పులను సూచిస్తూ ప్రతిపాదిత బిల్లులపై తన నివేదికలను సమర్పించింది.  ప్రస్తుతం దేశంలో అమలవుతున్న బ్రిటిష్‌ కాలానికి చెందిన ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను మార్చేసింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యం చట్టం తీసుకువచ్చింది. కొత్త చట్టాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. ఇందులో తీవ్రవాద నిర్వచనాన్ని సైతం మార్చింది. ఆర్ధిక అంశాల్లో జరిగే నేరాలను కూడా తీవ్రవాదంగా పరిగణిస్తూ మార్పు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.