Delhi-Meerut RRTS: 



దేశంలోని తొలి ర్యాపిడ్ ట్రైన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్‌ కారిడార్‌లో  (Regional Rapid Transit System) ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ రైళ్లకు ప్రధాని 'NaMo Bharat' అనే పేరు పెట్టారు. షహీదాబాద్ నుంచి దుహాయ్ డిపోట్‌ వరకూ మొత్తం 80 కిలోమీటర్ల దూరం ఈ ట్రైన్స్‌ ప్రయాణించనున్నాయి.





2019 మార్చి 8వ తేదీన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌కి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు ఆయనే ప్రారంభించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 






తొలి టికెట్‌ కొనుగోలు చేసిన ప్రధాని ట్రైన్‌లో కొంత దూరం ప్రయాణించారు. విద్యార్థులతో పాటు సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. ఈ మొత్తం కారిడార్‌ కోసం కేంద్రం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ రైళ్లలో ఢిల్లీ నుంచి మీరట్‌కి గంటలోపే చేరుకునే వెసులుబాటు ఉంటుంది. చూడడానికి మెట్రో రైళ్లలాగే ఉన్నప్పటికీ స్పీడ్‌లో చాలా తేడా ఉంటుంది. గంటకి 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. కోచ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లగేజ్ క్యారియర్స్‌తో పాటు మినీ స్క్రీన్‌లు అమర్చారు. ఢిల్లీ నుంచి మీరట్‌కి 82 కిలోమీటర్ల వేగాన్ని 60 నిముషాల్లోగానే చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. హైస్పీడ్‌, హై ఫ్రీక్వెన్సీ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. కనీస టికెట్ ధర రూ.15-20 వరకూ ఉండగా...గరిష్ఠ ధర రూ.160గా నిర్ణయించారు. 2025 జూన్ నాటికి మిగతా రూట్‌లలోనూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ రైళ్లలోనే ఓవర్‌హెడ్‌ లగేజ్ ర్యాక్స్‌ ఏర్పాటు చేశారు. వైఫై కనెక్టివిటీ కూడా ఉంది. వీటితో పాటు ల్యాప్‌టాప్స్‌, మొబైల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ పాయింట్స్‌ ఇచ్చారు. ఈ ట్రైన్‌లో ప్రత్యేకంగా డిలక్స్ కార్‌ ఉంటుంది. ఇందులో సీట్‌లు చాలా విశాలంగా ఉంటాయి. లెగ్‌రూమ్‌ ఎక్కువగా ఇచ్చారు. కోట్‌ హ్యాంగర్స్‌ కూడా ఉన్నాయి.