రైలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న ప్రధాని మోదీ



ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన స్థలానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక రిపోర్టును ప్రధానికి వివరిస్తున్నారు. అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న కటక్‌లోని ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని మృతి చెందిన ఘటనా స్థలాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శనివారం సందర్శించారు.




ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 261కి పెరిగింది. మరో 900 మంది వరకు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం శనివారం ఉదయం బాలాసోర్ లో రైలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బాధితులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.





రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్ 
లూప్‌లైన్‌లోకి కోరమాండల్.. ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయగా...ప్రాథమికంగా ప్రమాదం ఎలా జరిగిందో అంచనా వేశారు అధికారులు. జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే...12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి అప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అప్‌ లైన్‌లో వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. అప్పటికే గూడ్స్‌ లూప్‌ లైన్‌లో ఉంది. కానీ...కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌లైన్‌లోకి ఎంటర్ అయింది. వేగంగా దూసుకెళ్లి లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ట్రైన్‌ని బలంగా ఢీకొట్టింది. ఫలితంగా దాదాపు 10-15 కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. సరిగ్గా అదే సమయానికి యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చి పట్టాలపై పడి ఉన్న కోరమండల్ కోచ్‌లను ఢీకొట్టి అదుపు తప్పింది. ఇలా ఒక్క చోటే మూడు ప్రమాదాలు జరిగాయని ప్రైమరీ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. అయితే...ప్రస్తుతానికి దీనిపై రైల్వే శాఖ అధికారికంగా స్పందించలేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ప్రమాదానికి కారణాలంటే వెల్లడించలేదు. కమిటీ విచారణ పూర్తైన తరవాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రైల్వే సేఫ్‌టీ కమిషనర్‌ రిపోర్ట్ వచ్చాకే అసలు కారణాలేంటో తెలుస్తాయని తేల్చి చెప్పారు.
Also Read: Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్