Coromandel Express Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా.. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 850 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పురా-హావ్ డా ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది చనిపోయారు, మరెంత మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉన్నాయనే విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. రెండు రైళ్లలో ఏపీకి చెందిన వారి యోగక్షేమాలపై పూర్తి సమాచారం ఇచ్చింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం సంభవించినప్పుడు అందులో ప్రయాణిస్తున్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. రిజర్వేషన్ చేసుకుని ప్రయాణిస్తున్న వారి వివరాలు వెల్లడించారు. రైల్లో ప్రయాణించిన వారిలో విశాఖపట్నానికి చెందిన 165 మంది, రాజమండ్రికి నుంచి 22 మంది, విజయవాడకు చెందిన 80 మంది మొత్తం 267 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 


కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 113 మంది ఫోన్ లు స్విచ్ఛాఫ్..


పాక్షికంగా గాయపడిన వారిలో విశాఖ నుంచి 11, ఏలూరుకు చెందిన ఇద్దరు, విజయవాడకు చెందిన ఇద్దరు, మొత్తం 20 మంది ఉన్నారు. ఈ మేరకు ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉన్నాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రిజర్వేషన్ ఉన్నా ఈ రైల్లో ప్రయాణం చేయని వారి జాబితాలో విశాఖ నుంచి 57 మంది, ఏలూరు నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి 22 మంది.. ఇలా మొత్తం 82 మంది ఉన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ లేదా సమాధానం ఇవ్వని ప్రయాణికుల సంఖ్య 113గా ఉన్నట్లు తేల్చారు. ఇందులో విశాఖ నుంచి 76 మంది, రాజమహేంద్రవరం నుంచి 9, విజయవాడ నుంచి 28 మంది ఫోన్ లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు రైల్వే శాఖ అధికారులు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. 


యశ్వంత్ పురా - హావ్ డా ఎక్స్ ప్రెస్ లోని 49 మంది సేఫ్


యశ్వంత్ పురా - హావ్ డా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ఏపీకి చెందిన 49 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో విశాఖ నుంచి 17 మంది, రాజమహేంద్రవరం నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి 21 మంది, బాపట్ల నుంచి 8 మంది మొత్తం 49 మంది సురక్షితంగా ఉన్నారు. ఇదే రైల్లో ప్రయాణిస్తూ పాక్షికంగా గాయపడిన వారు విశాఖపట్నం నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిజర్వేష్ ఉన్నా ఈ రైల్లో ప్రయాణించని వారు విశాఖ నుంచి ఐదుగురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి నలుగురు మొత్తం 10 మంది ఉన్నట్లు తెలిపారు. ఇదే రైల్లో రిజర్వేషన్ చేసుకున్న వారిలో ఫోన్ స్విచ్ఛాఫ్ లేదా ఫోన్ చేసినా స్పందించని వారు విశాఖ నుంచి 9, విజయవాడ నుంచి 16, నెల్లూరు నుంచి ముగ్గురు మొత్తం 28 మంది ప్రయాణికుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 


ఫొన్ లు ఏ లొకేషన్ లో స్విచ్ఛాఫ్ అయ్యాయో తెలుసునే ప్రయత్నాలు


అయితే వీరి ఫోన్ లు స్విచ్ఛాఫ్ అయ్యాయా, చికిత్స పొందుతున్నారా, చనిపోయారా, మరెక్కడైనా ఉన్నారా అనే విషయాలు తెలుసుకునేందుకు అధికారులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఆచూకీ తెలియని వారి ఫోన్లు ఏ లొకేషన్ లో స్విచ్ఛాఫ్ అయ్యాయో విశ్లేషించేందుకు డేటా తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.