Lightning Strikes: ఒడిశా రాష్ట్రంలో అసాధారణ పరిస్థితి నెలకొంది. 2 గంటల వ్యవధిలో ఏకంగా 61 వేల పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పిడుగుపాట్ల వల్ల 14 మంది గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు వివరాలు వెల్లడించారు. 


ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే భారీగా పిడుగులు కూడా పడ్డాయి. శనివారం 2 గంటల వ్యవధిలో ఏకంగా 61 వేల పిడుగులు పడ్డట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పిడుగులు పడ్డ ఆయా ప్రాంతాల్లో 12 మంది మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఇదే రకమైన పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు బారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం 48 గంటల్లో అల్పపీడనంగా మారవచ్చని పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. 


మరో వారం రోజుల పాటు ఇలాగే భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పిడుగుపాట వల్ల గజపతి, జగత్ సింగ్ పూర్, పూరీ, బలంగీర్ తదితర జిల్లాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో పశువులు కూడా మరణించాయని అని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు నష్ట పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ విరామం తర్వాత రుతు పవనాలు సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు ఇలాంటి పిడుగులు, ఉరుములు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


Also Read: PM Modi Leave: 9 ఏళ్లలో ఒక్క సెలవూ తీసుకోని ప్రధాని మోదీ, 3 వేల ఈవెంట్లకు హాజరు


పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఉరుములు, మెరుపులో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి.
సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువుల దగ్గర ఉంటే వెంటనే వాటికి దూరంగా వెళ్లాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి
ఉరుమలు శబ్ధం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి
కారు, బస్సు లాంటి వాహనాల లోపల ఉన్నట్లయితే వెంటనే అన్ని డోర్స్ మూసి ఉంచాలి
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నప్పుడు మీ మెడ వెనుక జట్టు నిక్కబొడుచుకోవడం గానీ, చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించండి
బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని.. తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి. దీని వలన ఉరుములు, మెరుపులు నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది
ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే కిటీకీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్ధం ఆగిపోయిన తరువాత కూడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి
పిడుగు బాధితులను తాకవచ్చు. వెంటనే వారికి సహాయం అందించండి
పిడుగు బాధితుడిని వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ, ఏదైనా ఆసుప్రతికి తరలించండి


పిడుగుపాటు సమయంలో చేయకూడనివి..


ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో, ఏవైనా టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు, మొబైల్స్ వాడరాదు
పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయకూడదు
మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి
వాహనంలో ఉన్నట్లయితే లోహపు భాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు అని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఈ జాగ్రత్తలు సూచించారు.