New Rules in Banking and Telecom Sectors సెప్టెంబ‌ర్ 1 నుంచి దేశ‌వ్యాప్తంగా కొన్ని కొత్త రూల్స్ అమ‌ల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్‌, ఎల్పీజీ, ఆధార్, టెలికాం విభాగాల‌కు సంబంధించి ఈ నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెడుతున్నారు. కొన్ని నిర్ణ‌యాలు ఖ‌ర్చుల‌పై ప్ర‌భావం చూపుతుండ‌గా మ‌రికొన్ని నిర్ణ‌యాలు లాభం చేకూర్చ‌బోతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ ప్ర‌క‌ట‌న లాభం చేకూర్చ‌నుండ‌గా బ్యాంకింగ్‌, ఎల్పీజీల‌పై తీసుకున్న నిర్ణ‌యాలు ఖ‌ర్చుల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి.


క్రెడిట్ కార్డుల‌పై యుటిలిటీ పాయింట్లు 2వేల‌కు కుదింపు


సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ నిబంధ‌న‌లు మార‌బోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యుటిలీటీ లావాదేవీల‌పై ప‌రిమితిని విధించింది. వినియోగ‌దారులు ఇక‌పై నెల‌కు 2000 క్రెడిట్ పాయింట్ల వ‌ర‌కు మాత్ర‌మే పొందుతారు. కొన్ని నిర్దిష్ట వ్య‌య వ‌ర్గాల్లో రివార్డుల‌ను నియంత్రించే ల‌క్ష్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలో కోట్లాది మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. వారంద‌రిపై ఈ ప్ర‌భావం క‌నిపించ‌నుంది. టెలికాం కేబుల్ లావాదేవీలు కూడా 2000 పాయింట్ల‌కు ప‌రిమితం చేశారు. ఈ లావాదేవీల‌న్నీ నిర్దిష్ట కోడ్ (MCC) కింద ట్రాక్ చేస్తారు. 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇకపై థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా జ‌రిపే విద్య చెల్లింపులకు రివార్డ్ పాయింట్లు చెల్లించ‌దు. ఇక‌పై తప్పనిసరిగా విద్యా సంస్థ వెబ్‌సైట్ ద్వారా లేదా POS మెషీన్‌ల ద్వారా మాత్ర‌మే ప్రత్యక్ష చెల్లింపులను చేయాలి.


ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని తగ్గించింది. దీంతోపాటు చెల్లింపు గడువును కూడా 18 నుంచి 15 రోజులకు తగ్గించేసింది. 


UPIలో రూపే క్రెడిట్ కార్డ్


RuPay క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు సెప్టెంబరు 1 నుంచి యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చెల్లింపులు చేసిన‌ట్ల‌యితే ఆయా చెల్లింపు సేవా ప్రదాతల క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్న వారి రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. క్రెడిట్ కార్డ్‌ల రివార్డ్ పాయింట్లు, ప్రయోజనాలలో సమానంగా ఉండేలా చూడాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) RuPay  బ్యాంకులను ఆదేశించింది.


గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌పై స‌మీక్ష‌


ప్ర‌తినెలా 1వ తేదీన కేంద్ర ప్ర‌భుత్వం ఎల్పీజీ సిలిండ‌ర్లను సమీక్ష చేసి ధ‌ర‌ల్లో మార్పులు చేస్తుండ‌టం జ‌రుగుతుంది. అయితే క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల‌లోనే ఎక్కువ మార్పులు జరుగుతుంటాయి. గ‌త‌నెల‌లో క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ. 8.50 లు పెరిగింది. జూలైలో రూ. 30 త‌గ్గింది. ఇక‌పై ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరపై కూడా సమీక్ష జరిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతోపాటు సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధ‌ర‌ల‌పై కూడా మార్పు క‌నిపించే అవ‌కాశం ఉంది. 


టెలికాం కంపెనీల‌కు సూచ‌న‌లు
వ‌చ్చే నెల నుంచి ఫేక్ కాల్స్‌, ఫేక్ మెసేజెస్ నియంత్ర‌ణ‌పై కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. ట్రాయ్ (టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా)  ఆదేశాల మేర‌కు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కొన్ని సూచ‌న‌లు చేసింది. టెలీమార్కెటింగ్‌, క‌మ‌ర్షియ‌ల్‌, ప్ర‌చారం కోసం చేసే కాల్స్ కు ఇక‌పై 140 తో ప్రారంభ‌మ‌య్యే నంబ‌ర్ ఎంచుకోవాల‌ని సూచించింది. ట్రాయ్ సూచ‌న‌తో ఇక‌పై వినియోగ‌దారుల‌కు అన్‌వాంటెడ్ కాల్స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. 140 తో కాల్ వ‌స్తే మాట్లాడ‌టం ఇష్టం లేన‌ప్పుడు క‌ట్ చేసేయొచ్చు. కానీ ఇంత‌కాలం సాధార‌ణ నంబ‌ర్ల నుంచే కాల్స్ వ‌స్తున్న కార‌ణంగా వినియోగ‌దారులు ఇబ్బందులు ప‌డేవారు. 


ఆధార్ కార్డు అప్‌డేట్‌..


ఆధార్ కార్డు అప్‌డేట్ కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం వెలువ‌డిన‌ట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ త‌ర్వాత ఆధార్ కార్డులో ఏవైనా మార్పు చేర్పులు చేసుకోవాలంటే మాత్రం ఖ‌చ్చితంగా రుసుము చెల్లించాలి. సో.. ఉచితంగా ఈ సేవ‌ల‌ను పొందాలంటే సెప్టెంబ‌ర్ 14 వ‌ర‌కే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వినియోగ‌దారులు త్వ‌ర‌గా స‌రిచేసుకోండి. 


ఉద్యోగుల డీఏ 3 శాతం పెంపు?


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ప్రకటన రానున్న‌ట్టు స‌మాచారం. కేంద్ర ప్ర‌భుత్వం డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. డీఏను 3 శాతం పెంచుతార‌ని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అదే క‌నుక‌ జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతానికి పెరుగుతుంది.