Ujjain Rape Case: ఉజ్జయిని రేప్ కేసు ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దారుణంగా అత్యాచారానికి గురైన బాలిక.. తీవ్ర వేదనతో సాయం చేయాలంటూ అర్ధనగ్నంగా ఇంటింటికి వెళ్లి అడిగిన తీరు దేశాన్ని కుదిపేసింది. తీవ్రంగా రక్తమోడుతూ.. తనకు సాయం చేయాలని ఇంటింటికి తిరుగుతూ వేడుకున్నా ఒక్కరూ సాయం చేయకపోవడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. చివరికి ఓ గుడి పూజారి బాలికకు కొత్త బట్టలిచ్చి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారికి తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికలను ఆస్పత్రికి తరలించి, 700 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు. 


ఈ కేసులో ప్రధాన నిందితుడైన భరత్ సోనిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దర్ని కూడా పట్టుకున్నారు. నిందితుడు భరత్ సోని తండ్రి తాజాగా ఈ ఘటనపై స్పందించారు. తన కొడుకు చేసింది సిగ్గుమాలిన చర్య అని, తనను కలిసేందుకు ఆస్పత్రికి, పోలీసు స్టేషన్, కోర్టుకు వెళ్లనని చెప్పారు. తన కొడుకు తీవ్రమైన నేరం చేశాడని, అలాంటి వాడిని ఉరి తీసి చంపాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కూడా తన కూతురు లాంటిదే అని ఆయన అన్నారు. 


గురువారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు భరత్ సోని తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భరత్ సోనిని పట్టుకున్నారు. బాధిత బాలిక ప్రస్తుతం ఇండోర్ లోని ప్రభుత్వ మహారాజా తుకోజీరావు హోల్కర్ మహిళా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 


కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు


దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మౌనంగా ఉన్నారని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో దళితులుగా, గిరిజనులుగా, మహిళలుగా ఉండటం పాపంగా మారిందని విమర్శించింది. మైనర్ల అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, 18 ఏళ్ల పాలనలో 58 వేల రేప్ కేసులు నమోదు అయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.


'తెలిసినా చెప్పకపోవడం బాధ్యతారాహిత్యమే'


బాలికపై రేప్ జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేశ్ మాలవ్యకు ఈ విషయం తెలిసి కూడా పోలీసులు చెప్పకపోవడం బాధ్యతారాహిత్యమని ఉజ్జయిని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్ అన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేశ్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రేప్ జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూత సాయం అడిగినా ఎవరూ స్పందించకపోవడం కూడా తప్పేనని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


700 సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడి అరెస్టు


ఉజ్జయినిలో బాలిక రేప్ జరిగిన సమయంలో పోలీసులంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ తెలిపారు. బాలిక రేప్ గురించిన విషయం తెలియగానే ఆస్పత్రికి వళ్లి బాలికను పరామర్శించినట్లు వెల్లడించారు. 700 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్ ను నిందితుడిగా గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని విచారణలో పాల్గొన్నారని, వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.