Narendra Modi Oath Taking: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈనెల 9వ తేదీ సాయంత్రం 7.15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మల్టీ లెవెల్ సెక్యూరిటీ కోసం 5 కంపెనీల పారామిలిటరీ దళాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్‌లను రంగంలోకి దించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 


సార్క్ దేశాలకు ఆహ్వానం
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ‘సార్క్‌ (SAARC)’ దేశాల ప్రతినిధులను దీనికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌, సీషెల్స్‌ దేశాల అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. భారత్‌కు చెందిన ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’తోపాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలకంగా భావించే ద్వీప దేశాలను దృష్టిలోఉంచుకుని విదేశీ అతిథుల జాబితాను రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ఆదివారం నాటి చారిత్రక ఘట్టానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 


భద్రతా బలగాల ఆధీనంలో హోటళ్లు
ఈ నేపథ్యంలోనే ఐటీసీ మౌర్య, లీలా, తాజ్‌, ఒబెరాయ్‌ వంటి ప్రముఖ హోటళ్లలో విదేశీ ప్రముఖులకు వసతి కల్పించనున్నారు. ఆయా హోటళ్లను భద్రత పరిధిలోకి తీసుకున్నాయి. హోటళ్ల నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్‌ఎస్‌జీ, డిల్లీ పోలీస్‌ విభాగంలోని  కమాండోలను రాష్ట్రపతి భవన్‌ పరిసరాల్లో, ఇతర కీలక ప్రాంతాల్లో మోహరించారు. 


2500 మంది పోలీసులతో భద్రత
మోదీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు. రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రత ఉంటుందని తెలిపారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్రపతి భవన్‌ అంతర్గత భద్రత సిబ్బంది సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు. 2500 మంది పోలీసులు, ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీసు (డీఏపీ) జవాన్లు విధుల్లో ఉంటారని ఆయన వెల్లడించారు. 


ప్రత్యేక నిఘా
అలాగే ప్రముఖులు రాకపోకలు సాగించే మార్గాలు అన్నింటిలో స్నైపర్లు,  సాయుధ సిబ్బంది, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. ఢిల్లీ మధ్య ప్రాంతానికి వెళ్లే రహదారులను ఆదివారం మూసివేసే అవకాశం ఉందని తెలిపారు. దేశ రాజధాని సరిహద్దుల్లో శనివారం ముమ్మర తనిఖీలు ఉంటాయని, ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించే అవకాశం ఉందన్నారు. ప్రజలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవాలని అధికారులు కోరారు.


విశిష్ట  అతిథులు
మోదీ ప్రమాణ స్వీకారానికి పలువురు విశిష్ట అతిథులు కూడా హాజరుకానున్నారు. శానిటేషన్‌ సిబ్బంది, ట్రాన్స్‌ జెండర్లు, సెంట్రల్‌ విస్టా నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అదేవిధంగా వికసిత్‌ భారత్‌ అంబాసిడర్లు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారిని, వందేభారత్‌, మెట్రో రైళ్లలో పనిచేసే సిబ్బందిని ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో సుమారు 8 వేల మంది పాల్గొంటారని అంచనా.