Merchant Ship Attacked:  అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక (Merchant Ship) పై డ్రోన్‌ దాడి (Drone Attack) జరిగినట్లు ఇండియన్ నేవీ (Indian Navy) నిర్దారించింది. దాడి జరిగిన భారీ నౌకను ఐసీఏఎస్‌ విక్రమ్‌ సాయంతో ముంబయి పోర్టుకు తరలించారు. అరేబియా సముద్రంలో గుజరాత్‌((Arabian Sea) తీరానికి 400 కిలోమీటర్ల సమీపంలో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్‌ అటాక్ జరింది. సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన నౌకను గుర్తించింది ఇండియన్ నేవీ.  తీర ప్రాంతానికి 400 కి.మీ దూరంలో  వాణిజ్య నౌక ఎంవీ కెమ్‌ ప్లూటోపై డ్రోన్‌ జరిగినట్లు నిర్దారించింది. 20 మంది భారతీయులతోపాటు మొత్తం 21 మంది నౌకా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.  డ్రోన్‌ దాడితో నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్‌ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండియన్ నేవీ ఐసీజీఎస్‌ విక్రమ్‌ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఐసీజీఎస్‌ విక్రమ్‌ రక్షణలో... ఎంవీ కెమ్‌ ప్లూటో వాణిజ్య నౌక ముంబయి పోర్ట్‌ ప్రాంతానికి చేరుకుంది. 


ఇరాన్ మద్దతుతో హౌతీ రెబల్స్ దాడులు
మరోవైపు ఇరాన్ మద్దతుతో హౌతీ రెబల్స్ దాడులతో చెలరేగుతున్నారు. ఇన్నాళ్లు ఎర్రసముద్రంపై వాణిజ్యనౌకలను టార్గెట్ చేసిన ఈ ముఠా, ఇప్పుడు ఏకంగా అరేబియా సముద్రంలోనూ దాడికి ప్రయత్నించింది. గుజరాత్‌లోని వెరావల్‌ తీరానికి 400 నాటికల్‌ మైళ్ల దూరంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్‌ ప్లూటోపై శనివారం డ్రోన్‌ దాడి జరిగింది. వెంటనే భారత కోస్ట్‌గార్డుకు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్‌ విక్రమ్‌, పీ-81 మారిటైమ్‌ పెట్రోలింగ్‌ విమానం ఘటనా స్థలానికి వెళ్లాయి. వాణిజ్య నౌకలో మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. ఈ ప్రమాదం నుంచి నౌకలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.


మరో రెండు వాణిజ్య నౌకలపై కూడా డ్రోన్ దాడి 
మరోవైపు ఎర్ర సముద్రంలో మరో రెండు వాణిజ్య నౌకలపై కూడా డ్రోన్ దాడి జరిగింది. అందులో గాబన్‌ జెండాతో వస్తోన్న ఒక నౌక ఉంటే, ఎంవీ సాయిబాబా పేరిట భారత్‌లో ఈ నౌక రిజిస్టర్‌ అయింది. అటే నార్వే జెండాతో ఉన్న ఎంవీ బ్లామనెన్ నౌకపై కూడా హౌతీలు దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ లబూన్‌ పై కొన్ని డ్రోన్లు దాడికి యత్నించాయి. ఆ యుద్ధనౌక వాటిని కూల్చివేసింది. దీంతో అక్టోబర్‌ 17 తర్వాత వాణిజ్య నౌకలపై 15 పర్యాయాలు దాడులు జరిగాయి. భారత్‌కు వస్తున్న నౌకపై జరిగిన దాడికి కారణమైన డ్రోన్‌ ఇరాన్‌ భూభాగం నుంచి బయల్దేరిందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ ఆరోపించింది. శనివారం గుజరాత్‌ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో జరిగిన దాడితో, ఎర్రసముద్రం పరిధి దాటినట్లైందని పెంటగాన్‌ వెల్లడించింది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్  నేరుగా నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని పెంటగాన్ బహిరంగంగా ఆరోపించింది. తాజాగా దాడికి గురైన నౌక లైబీరియన్‌ జెండాతో వస్తోందని తెలిపింది. ఇది డచ్‌ సంస్థకు చెందినదని వెల్లడించింది.