Election Funds: ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం,పోలింగ్ ఖర్చుల కోసం రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందుతుంటాయి. బడా సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఎవరికి వారు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తారని పార్టీలు చెబుతున్నారు....ఇవన్నీ ముక్కుపిండి బెదిరించే వసూళ్లేనని బహిరంగ రహస్యమే. కొందరు వ్యాపారులకు గెలిచిన తర్వాత ప్రభుత్వంలో పనులు చేయించుకునేందుకు ముందుగానే విరాళాలు అందజేసి బుట్టలో వేసుకుంటాయి. అయితే ఈసారి విరాళాలు అందుకునే విషయంలో అధికార పార్టీ బీజేపీ(BJP) ముందంజలో ఉంది.


డబ్బే డబ్బు
కేంద్రంలో మరోసారి ఎన్డీఏ(NDA) కూటమి అధికారంలోకి వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీకి ఎన్నికల ఫండ్ వెల్లువెత్తుతోంది. విరాళాలు అందుకునే విషయంలో ఆ పార్టీ అగ్రస్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి అత్యధికంగా విరాళాల రూపంలో బీజేపీ(BJP) రూ.2,120 కోట్లు వచ్చిపడ్డాయి. ఒక్క ఎలక్టోరల్ బాండ్ల (Etoral Bonds) ద్వారానే సుమారు రూ.1300 కోట్లు అందాయి.కాంగ్రెస్‌కు వచ్చిన బాండ్లకన్నా 6 రెట్లు అధికం. ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. హెలికాప్టర్లు, విమానాల కోసం రూ.78.2 కోట్లు ఖర్చు చేయగా.. రూ.76.5 కోట్లు పార్టీ సభ్యులకు ఆర్థిక సాయంగా అందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీకి విరాళాల రూపంలో రూ.1,775 కోట్లు వచ్చింది.


ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు ఆ పార్టీకి విరాళాలు పెరిగాయి. అధికారికంగా అందిన విరాళాల సంగేతే ఇంత ఉంటే....ఇక అనధికారికంగా అందిన మొత్తం ఇంకా ఎన్నివేల కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే పార్టీలకు వచ్చే విరాళాలు, ఖర్చులపై ఎన్నికల సంఘం ప్రత్యంగా దృష్టిసారిస్తుంది. ప్రతిపైసాకు లెక్క చూపించాల్సి ఉండటంతో దాదాపు అన్ని పార్టీలు ఈమధ్యకాలంలో లెక్కలు పక్కాగా నిర్వహిస్తున్నాయి. 


అయ్యోపాపం కాంగ్రెస్
అధికారం లేకపోతే అయినవాడు పలకరించడని...దాదాపు దశాబ్దకాలంగా అధికారానికి దూరమైన కాంగ్రెస్(Congress) కు ఎన్నికల నిధులిచ్చేవారు కరవయ్యారు.గతంలో ఆ పార్టీ ద్వారా లబ్ధిపొందిన బడా పారిశ్రామికవేత్తలు సైతం ముఖం చాటేశారు. 2022-23లో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఆ పార్టీకి కేవలం రూ.171 కోట్లు మాత్రమే వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.236 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం చాలావరకు తగ్గడం గమనార్హం. ఎన్నికల వేళ విరాళాలు పెరగాల్సిందిపోయి తగ్గడం చూస్తే....విరాళాలు ఇచ్చే సంస్థలు, వ్యాపారులను సైతం బీజేపీ(BJP) బాగానే కంట్రోల్ లో పెట్టినట్లు అర్థమవుతోంది.


రాజకీయంలో భాగంగా ఇక్కడ రెండు రకాల ఎత్తులు ఉన్నాయి. ఒకటి మా పార్టీకి విరాళాలు ఇవ్వమని కోరడం...మరొకటి ప్రత్యర్థులకు విరాళం ఇస్తే ఒప్పుకోకపోవడం. ఎందుకంటే ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీస్తేనే..ఎన్నికల్లో వారికి డబ్బులు దొరక్క ఉక్కిరిబిక్కిరి చేయోచ్చు. కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి విరాళాలు అందజేసే సంస్థలపై దాడులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఈ అరకొర నిధులతోనే ఈసారి సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే ఆ పార్టీకి ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉండటంతో పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు.  అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాదీ(SP) పార్టీకి 2021-22లో రూ.3.2 కోట్లు రాగా.. 2022-23లో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఎలాంటి నిధులూ రాలేదు. తెలుగుదేశం(TDP) పార్టీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.34 కోట్లు విరాళంగా వచ్చాయి. జాతీయ పార్టీలకు వేలకోట్లు విరాళాల రూపంలోవస్తుండగా..ప్రాంతీయపార్టీలకు మాత్రం అరకొరగానే నిధులు అందుతున్నాయి.