రాయ్పూర్: ఆయుధాలను వదిలేసేందుందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) డెడ్లైన్ ఫిక్స్ చేసుకుంది. ఎంఎంసి సహచరులందరూ జనవరి 1, 2026న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రభుత్వాలకు ఆయుధాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ పునరావాసం కల్పిస్తే లొంగిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మావోయిస్టు కమిటీ ప్రతినిధి లేఖలో పేర్కొన్న అంశాలివే..
‘అప్పటి వరకు, 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, భద్రతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని అభ్యర్థిస్తున్నాం. జోన్లో ఎక్కడా భద్రతా దళాలు అరెస్టులు లేదా ఎన్కౌంటర్లు వంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదు. జోన్ అంతటా చెల్లాచెదురుగా ఉన్న మా సహచరులందరితో సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేం ప్రయత్నిస్తాము. భద్రతా దళాల కార్యకలాపాలను కొనసాగించడం మాకు అంతరాయం కలిగిస్తుంది. మా ప్రయత్నాలను వేగవంతం చేయకుండా నిరోధిస్తుంది. మా ఆయుధాలను ముక్కలుగా అప్పగించే బదులు, ప్రభుత్వ పునరావాస ప్రణాళికను ఒకేసారి లేదా పెద్ద సంఖ్యలో అంగీకరించి జన జీవన స్రవంతిలో చేరాలనుకుంటున్నాం.
విజయ్ శర్మ (ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంమంత్రి) రేడియోలో మాట్లాడటం మేం విన్నాము. ఈ ప్రయోజనం కోసం 10 నుండి 15 రోజులు సరిపోతాయని అన్నారు. ఆయన ప్రతిస్పందనను మేం గౌరవిస్తాము, కానీ అంత తక్కువ సమయం సరిపోదు. ఆయుధాలను వదులుకుని ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడానికి మేము నిర్ణయించిన ఖచ్చితమైన తేదీకి (జనవరి 1, 2026) ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు.
మా ప్రతిపాదనలు, డిమాండ్లు చేయాలనుకుంటే, ప్రభుత్వం వాటిని వింటుందని.. అందుకు ప్రయత్నాలు చేస్తుందని తన ప్రకటనలో పేర్కొన్నందుకు విజయ్ శర్మకు మా కృతజ్ఞతలు. ప్రభుత్వానికి కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు, డిమాండ్లను చెబుతాం. ప్రధాన స్రవంతిలో చేరడానికి ముందు లేదా పునరావాసం తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాలు చేర్చుతాము.
మిగిలిన రెండు రాష్ట్రాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్) ప్రభుత్వాల నుండి మా అభ్యర్థనపై విజయ్ శర్మ నుండి వచ్చిన ప్రతిస్పందనతో మాకు భరోసా రాలేదు. మిగిలిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చిడి భరోసా కలిగించే రెస్పాన్స్ కోసం చూస్తున్నాం. విజయ్ శర్మ లాగా, వారు మాకు ప్రతిపాదనలు, డిమాండ్లను అందిస్తే, ప్రజల తరపున మేం ఖచ్చితంగా అలాగే చేయాలనుకుంటున్నాము.
ఒంటరిగా వెళ్లి లొంగిపోవద్దు..
ఈ ప్రక్రియ అయ్యే వరకు జోన్ అంతటా ఉన్న మా సహచరులు తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలి. దానికి అంతరాయం కలిగించే ఎటువంటి ప్రేరణ లేదా చర్యలో పాల్గొనవద్దు. ఈసారి మేము PLGA వారోత్సవాన్ని పాటించబోం. ఈ వారంలో తన భద్రతా దళాల గస్తీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. జోన్ అంతటా ఉన్న అన్ని సహచరులకు మేం ఆడియో విజ్ఞప్తిని జారీ చేస్తాము. దీని గురించి విన్న లేదా తెలుసుకున్న వెంటనే ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించాలని కామ్రేడ్లను అభ్యర్థిస్తున్నాము. స్వయంగా వెళ్లి లొంగిపోవద్దని కూడా కామ్రేడ్లను అభ్యర్థిస్తున్నాము. మనమందరం దీన్ని కలిసి చేయాలి’ అని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో మావోయిస్టు ప్రతినిధి అనంత్ స్పష్టం చేశారు.